ఐచర్ బీభత్సం | Sakshi
Sakshi News home page

ఐచర్ బీభత్సం

Published Tue, Jul 18 2017 11:08 PM

ఐచర్ బీభత్సం

– 60 గొర్రెలు మృత్యువాత
– త్రుటిలో తప్పించుకున్న కాపరులు
– రూ.4 లక్షలకు పైగా ఆస్తి నష్టం


అనంతపురం సెంట్రల్‌ : గొర్రెల మందపై ఐచర్‌ వాహనం దూసుకెళ్లి 60 గొర్రెల మృత్యువాత పడిన సంఘటన మంగళవారం రాత్రి నగరంలోని తపోవన సర్కిల్‌ సమీపంలో జరిగింది. సుమారు రూ.4 లక్షలు నష్టం వాటిల్లినట్టు కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అదృష్టవశాత్తూ కాపరులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు పోతన్న, నారాయణ, వర్దనప్ప మేపు కోసం గొర్రెలతో నెలరోజుల క్రితం నార్పలకు వెళ్లారు. అయితే ఇటీవల కురిసిన తొలకరి వర్షాలతో స్వగ్రామంలో మేత దొరుకుతుందనే ఉద్దేశంతో తిరిగి వస్తుండగా మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో తపోవనం సమీపంలో రోడ్డు దాటుతున్న గొర్రెల మందపై బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఐచర్‌ వాహనం (కేఏ02 ఏఈ 0821) వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో సుమారు 60 గొర్రెలు మృతి చెందాయి. ఘటనలో కొన్ని గొర్రెలు రోడ్డుకే అతుక్కుపోయాయి. రూ. 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఐచర్‌ వాహనం అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వివరించారు. ఘటన జరిగిన వెంటనే నాల్గో పట్టణ, ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఐచర్‌ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Advertisement
Advertisement