గెలుపు కోసం.. కొలువు కోసం పరుగు | Sakshi
Sakshi News home page

గెలుపు కోసం.. కొలువు కోసం పరుగు

Published Tue, Jun 28 2016 1:55 AM

గెలుపు కోసం.. కొలువు కోసం పరుగు - Sakshi

పోలీస్ ‘పరీక్ష’కు సిద్ధం  కిటకిటలాడిన పరేడ్‌గ్రౌండ్
ఉదయం 4 గంటల నుంచే క్యూ నాలుగేళ్ల తర్వాత నోటిఫికేషన్
జిల్లాలో తొలిసారిగా ఎస్‌ఐల సెలక్షన్
800 మీటర్ల పరుగులో వెనుదిరుగుతున్న అభ్యర్థులు
ఆలస్యమైనందున నీరసించినట్టు ఆరోపించిన అభ్యర్థులు

సంగారెడ్డి టౌన్: తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ప్రభుత్వం తొలిసారి పోలీసు శాఖలో ఎస్‌ఐ పోస్టుల భర్తీ నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియకు భారీ స్పందన లభిస్తోంది. జిల్లాలో వేలాది మంది యువత పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొన్నారు. ఎస్సై ప్రాథమిక అర్హత పరీక్షలో 3600 మంది ఉత్తీర్ణులయ్యారు. వారికి  సంగారెడ్డిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో  దేహదారుఢ్య , ఈవెంట్ పరీక్షలు  నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు సుమారు 1200 మంది అభ్యర్థులు హాజరైనట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పోలీసు కళ్యాణమండపంలో అభ్యర్థుల విద్యార్హత ధృవపత్రాల పరిశీలన, బయోమెట్రిక్  హాజరు ప్రక్రియ నమోదు చేశారు.

అక్కడి నుండి పోలీస్ పరేడ్ మైదానంలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల ఎత్తు, ఛాతీ చుట్టు కొలత, బరువు తదితర పరీక్షలు నిర్వహించారు. ఇందులో అర్హులకు బ్యాచ్‌ల వారీగా 800 మీటర్ల రన్నింగ్ పరీక్షను చేపట్టారు.  కచ్చితంగా అర్హత సాధించాల్సిన ఈ 800 మీటర్ల రన్నింగ్‌లో అర్హులకు మిగతా ఈవెంట్స్ అయిన హై జంప్, లాంగ్ జంప్, షార్ట్‌పుట్, 100 మీటర్ల రన్నింగ్‌ను నిర్వహించారు.   

 సర్టిఫికెట్లతో తంటాలు...
కొన్ని ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీలు పూర్తిచేసిన కొంతమంది అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు.  సంబంధిత కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రియంబర్స్‌మెంట్ వచ్చాకే అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇస్తామని చెప్పడంతోవిద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు వారిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించలేదు.  దీంతో కొంతమంది అభ్యర్థులు దేహ దారుఢ్య పరీక్షల్లో పాల్గొనకుండానే సర్టిఫికెట్లు తెస్తామంటూ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అనుమతితో వెనుదిరిగారు.  ఒరిజినల్ సర్టిఫికెట్లు లేనివారికి మరో రెండు రోజుల గడువును ఇచ్చారు.

 ఉదయం నుంచి క్యూలో అభ్యర్థులు..
తెల్లవారుజామున  4 గంటల నుంచే అభ్యర్థులు క్యూలో నిల్చున్నారు. ఉదయం 8 గంటలకు పోలీసు అధికారులు  ప్రక్రియ మొదలు పెట్టారు. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫాం, ఇంటిమేషన్ లెటర్, హాల్‌టికెట్ తదితర ధృవపత్రాలు లేక కొందరు అభ్యర్థులు సమీప నెట్‌సెంటర్లకు పరుగులు తీశారు. ఉదయం నుండి వరులో నిలుచున్నామని, ఈవెంట్లు వచ్చేవరకు మధ్యాహ్నం కావడంతో అలసిపోయి  రన్నింగ్ చేయలేకపోయామని కొందరు అభ్యర్థులు కన్నీరుమున్నిరయ్యారు. చాలా మంది అభ్యర్థులు 800 మీటర్ల పరుగులోనే వెనుదిరగడం గమనార్హం.

నాలుగు రౌండ్లు...
ఈవెంట్‌లో పాల్గొన్న అభ్యర్థులు 800 మీటర్ల పరుగు పందెం చేసేందుకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ ట్రాక్ కేవలం 200 మీటర్లు ఉండడంతో అభ్యర్థులు నాలుగు రౌండ్లు పరుగు తీయాల్సి వస్తోంది.  ట్రాక్ పెద్దగా ఉన్నట్లయితే పరుగు సులభతరంగా ఉండేదని పలువురు అభ్యర్థులు పేర్కొంటున్నారు. ట్రాక్ చిన్నగా ఉండడంతో ఎంట్రెన్స్‌లో క్వాలిఫై అయిన సగం మంది పరుగు పందెంలో రాణించలేక ఇంటిముఖం పడుతున్నారు.

5 కేను తొలగించిన ప్రభుత్వం...
గత ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు రిక్రూట్‌మెంటులో ముఖ్యంగా 5 కిలోమీటర్ల పరుగు 25 నిమిషాల్లో పరిగిత్తాల్సి ఉండేది.  ఈ పరుగు గతంలో అనేకమంది అభ్యర్థులు గమ్యం చేరకుండానే గుండెపోటుతో హఠన్మరణం చెందిన సంఘటనలు జరిగిన విషయం విధితమే.  కాగా, ఈ 5 కేఎంను తొలగించడంతో పోలీసు శాఖలో ఉద్యోగం కోసం ఆరటపడుతున్న అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు.  అప్పట్లో పోలీసు రిక్రూట్‌మెంటులో చదువు కంటే కూడా దేహ దారుఢ్యానికే ప్రాధాన్యత ఇచ్చారు.  ప్రస్తుతం ఐదు కేఎంను తొలగించి మిగతా ఈవెంట్లన్నింటినీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ ఐదు ఈవెంట్లలో 800 మీటర్లు తప్పని సరి క్వాలీఫై అవ్వాల్సి ఉంటుంది. లేనిచో వెనుదిరగాల్సిందే. ఇందులో క్వాలీఫై అయిన వారికి మిగతా నాలుగు ఈవెంట్స్‌లలో 100 మీటర్లు, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్‌పుట్‌లలో ఏవేని రెండు ఈవెంట్లలో అర్హత సాధించినా వారు అర్హులుగా నిర్ణయిస్తారు. 

 జిల్లాలో ఇదే మొదటిసారి...
ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటివరకు ఎస్సైల రిక్రూట్‌మెంటును హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో గల గోషామహల్ స్టేడియంలో నిర్వహించేవారు.  కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ జోన్ పరిధిలోని 539 ఎస్సై పోస్టులను తెలంగాణ 5వ జోన్‌లో చూపింది.  దీంతో ఎంట్రెన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను సంగారెడ్డిలోని పరేడ్ గ్రౌండ్‌లో మొట్టమొదటి సారిగా ఎస్సై అభ్యర్థుల దేహాధారుఢ్యం, ఈవెంట్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement