ఏటూరునాగారం : ఐటీఐలో నైట్ వాచ్మెన్ గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. క్రాస్రోడ్డులో నివాసం ఉంటున్న భూక్య సారయ్య (53) ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సారయ్యకు ఇద్దరు కుమార్తెలు కాగా వారికి వివాహాలయ్యాయి. భార్య, కుమారుడితో కలసి సారయ్య క్రాస్రోడ్డులో నివాసం ఉంటున్నాడు.
కాగా శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన సారయ్య ఆదివారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. అయితే అంతకుముందే కుటుంబ సభ్యులు సమీపంలో ఉన్న రెండో కుమార్తె ఇంటికి వెళ్లారు. ఒంటిరిగా ఇంట్లో ఉన్న సారయ్య ఉరి వేసుకుని తనువు చాలించాడు. సారయ్య మృతికి కేవలం వ్యక్తిగత కారణాలేనని తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్సై నరేష్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను సేకరించారు. సారయ్య మృతి విషయం తెలుసుకున్న ఐటీఐ విద్యార్థులు, లెక్చరర్లు కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.