భద్రాచలం : వినాయక ప్రతిమలను భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారు కొలువైన చోట గోదావరిలో నిమజ్జనం చేయడానికి భక్తులు ఎక్కువ మక్కువ చూపిస్తారని, అందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చేయాలని ఐటీడీఏ పీఓ రాజీవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలోని తన చాంబర్లో వినాయక నిమజ్జనం కొరకు ముందస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. దేవాదాయ, ఇరిగేషన్, రోడ్లు, భవనాల శాఖ, గ్రామ పంచాయతీ, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్, మత్స్య, ఎక్సైజ్ శాఖల అధికారులు తమకు సంబంధించిన పనులను ప్రారంభించుకోవాలన్నారు. భక్తులకు శానిటేషన్, తాగునీరు, తీర్థ ప్రసాదాల విషయంలో ఎటువంటి లోటు రాకూడదన్నారు. కరకట్ట ప్రదేశాల్లో టెంట్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, నిమజ్జనానికి వచ్చే భక్తులు గోదావరిలోకి దిగకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా వినాయక భక్త మండళ్లు వరుస క్రమంలో వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. పండుగ ప్రారంభమైన తరువాత సెప్టెంబర్ 9 నుంచి 16వరకు నిమజ్జనం ప్రదేశాల్లో అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. భక్తులు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య అధికారులకు సూచించారు. పర్ణశాల వద్ద కూడా వినాయక ప్రతిమలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉన్నందున చిన్న విగ్రహాలను మాత్రమే పర్ణశాలకు పంపి పెద్ద విగ్రహాలను భద్రాచలంకు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంవీఐ ఈశ్వర్సింగ్, ఎక్సైజ్ సీఐ రాజశేఖర్రావు, ఇరిగేషన్ డీఈ రాంప్రసాద్, విద్యుత్ ఏఈ కోక్యా నాయక్, ఆర్అండ్బీ ఏఈ హరిలాల్, పీఆర్ ఏఈ శ్రీధర్, ఫైర్ ఆఫీసర్ సురేష్కుమార్, దేవస్థానం డీఏ రవీందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కరుణాకర్, సర్పంచ్ బి. శ్వేత, ఎంపీడీఓ రమాదేవి, వాజేడు, చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.