రసవత్తరంగా అనంత ప్రీమియర్‌ లీగ్‌ పోటీలు | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా అనంత ప్రీమియర్‌ లీగ్‌ పోటీలు

Published Sun, Nov 20 2016 11:04 PM

రసవత్తరంగా అనంత ప్రీమియర్‌ లీగ్‌ పోటీలు - Sakshi

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : అనంతపురం జిల్లా  క్రికెట్‌ అసోసియేషన్, ఆర్డీటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న అండర్‌–16 అనంత ప్రీమియర్‌ లీగ్‌  క్రికెట్‌ క్రీడా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఆదివారం ఆర్డీటీతో పాటు జిల్లాలోని పలు క్రీడా మైదానాల్లో ఈ పోటీలు జరిగాయి. ఆర్డీటీ బీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో గుంతకల్లు, తాడిపత్రి జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుంతకల్లు  185 పరుగులు చేసింది. జట్టులో సూరి 31, సాయి 27 పరుగులు చేశారు. తాడిపత్రి జట్టులో వినయ్‌ 4, దీక్షత్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బరిలోకి దిగిన తాడిపత్రి జట్టు 27 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. గుంతకల్లు జట్టులోని సాహుల్, సాయిలు చెరీ 4 వికెట్లు పడగోట్టి జట్టు విజయానికి దోహదపడ్డారు.

విన్సెంట్‌ మైదానంలో విశ్వనాథన్‌ ఆనంద్, బీకేఎస్‌ జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన విశ్వనాథన్‌ ఆనంద్‌ జట్టు 48 ఓవర్లలో 239 పరుగులు చేసింది. జట్టులో భరత్‌ 81, పవన్‌ కళ్యాణ్‌ 71,  వీరేంద్ర 31 పరుగులు సాధించారు. బీకేఎస్‌ బౌలర్లలో రమేష్‌ 4, హరి 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బీకేఎస్‌ జట్టు 40 ఓవర్లలో 179 పరుగులు చేసి ఆలౌటైంది. జట్టులో రమేష్‌ 56 పరుగులు చేశారు. ఆత్మకూరు స్కూల్‌ మైదానంలో జరిగిన ఆత్మకూరు, కళ్యాణదుర్గం జట్లు పోటీపడ్డాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆత్మకూరు జట్టు 37.4 ఓవర్లలో 158 పరుగులు చేసి ఆలౌటైంది. జట్టులో దిలీప్‌ 59 పరుగులు సాధించాడు. కళ్యాణదుర్గం జట్టులో ప్రశాంత్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం కళ్యాణదుర్గం జట్టు 30.2 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. ఆత్మకూరు జట్టులో అనిల్‌ 5, దిలీప్‌ 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి కీలకంగా మారారు.

మరోమ్యాచ్‌లో పెనుకొండ, హిందూపురం జట్లు తలపడగా హిందూపురం జట్టు మొదట బ్యాటింగ్‌ చేసి 142 పరుగులు చేసింది. అనంతరం పెనుకొండ జట్టు 32.5 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. జట్టులో మంజునాథ్‌ 49, ముదస్సిర్‌ 41 పరుగులు చేశారు. ఇంకో మ్యాచ్‌లో కణేకల్, రాయదుర్గం జట్లు తలపడగా మొదట రాయదుర్గం జట్టు 132 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కణేకల్‌ జట్టు 133 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులో హరిలాల్‌ నాయక్‌ 31 పరుగులు సాధించాడు. వచ్చే ఆదివారం కూడా మ్యాచ్‌లు కొనసాగుతాయని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి ప్రసన్న తెలిపారు.

Advertisement
Advertisement