భార్యను చంపి.. ఆత్మహత్యగా చిత్రించాడు! | Sakshi
Sakshi News home page

భార్యను చంపి.. ఆత్మహత్యగా చిత్రించాడు!

Published Sun, Jan 24 2016 2:37 PM

భార్యను చంపి.. ఆత్మహత్యగా చిత్రించాడు! - Sakshi

నిజాంపట్నం(గుంటూరు): భార్యను కిరాతకంగా హతమార్చి ఆత్మహత్యగా చిత్రించాలని ప్రయత్నించాడో ఓ ఆర్మీ ఉద్యోగి. గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఆదివారం  ఈ ఘటన వెలుగుచూసింది.  మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నిజాంపట్నంకు చెందిన లెనిన్(25) ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను స్థానికంగా నివాసముంటున్న షీలం సూర్యగౌతమి(20)ని ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. ఇందుకు ఇద్దరి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని రోజులకే ఉద్యోగం మానేశాడు. ఇంటి దగ్గర జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కులాంతర వివాహం కావడంతో.. పెళ్లి సమయంలో వధువుకు 50 సెంట్ల భూమిని లెనిన్ భరణంగా ఇచ్చాడు.

ఇప్పుడు దానిని అమ్మి డబ్బు తీసుకురమ్మని భార్యతో గత కొన్నిరోజులుగా గొడవ పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆమెను హతమార్చి అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని నమ్మించడానికి ప్రయత్నించాడు. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement