తాడేపల్లిగూడెం రూరల్ : మూకుమ్మడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఇది. ఈ కేసుకు సంబంధించి వివరాలను గురువారం రాత్రి స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ ఎంఆర్ఎల్ఎస్ఎస్ మూర్తి వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. టూ టౌన్ రోహిణి మెడికల్ షాపు సమీపంలో కోరుకొండ పవన్ (19) బజ్జీల బండి నిర్వహించేవాడు. గత నెల 9వ తేదీ రాత్రి 13 మంది విద్యార్థులు బజ్జీలు తిని వెళ్లిపోతుండగా పవన్ అడ్డుకున్నాడు. సొమ్ములు ఇవ్వాలని వారిని అడగటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో పవన్కు తీవ్ర గాయాలు కాగా తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు పంపించారు. దవడ భాగానికి వైద్యం అందించారు. ఆరోగ్యం క్షీణించడంతో విజయవాడ ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. గురువారం చికిత్స పొందుతూ పవన్ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడెం ఏరియా ఆసుపత్రికి పంపించారు. అనంతరం మృతదేహంతో బంధువులు, స్నేహితులు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని పట్టణ పోలీసులు వారించి మృతదేహాన్ని ఇంటికి తరలించారు.
11 మంది అరెస్ట్
కోరుకొండ పవన్ మృతి కేసులో 11 మంది నిందితులను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్సై ఎం.సూర్యభగవాన్ పాల్గొన్నారు.