బాబు వెంటే కరువు : రఘువీరా | Sakshi
Sakshi News home page

బాబు వెంటే కరువు : రఘువీరా

Published Mon, Oct 10 2016 10:43 PM

బాబు వెంటే కరువు : రఘువీరా - Sakshi

అగళి : అవిభక్త కవలలైన వాణి, వీణలను విడగొట్టడం ఎలా సాధ్యం కాలేదో చంద్రబాబును, కరువును విడగొట్టడం కూడా అలాగే సాధ్యం కాదని, కరువు ఎల్లప్పుడూ ఆయన వెంటే ఉంటుందని పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ వ్యంగ్య బాణాలు సంధించారు.

సినిమా డైలాగుల తరహాలో ‘నన్ను చూసి కరువు పారిపోతుంది’ అనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. వారు సోమవారం అగళి మండలంలోని పి.బ్యాడిగెర గ్రామ పరిధిలో ఎండిపోయిన వేరుశనగ పంటను పరిశీలించారు. అనంతరం హెచ్‌డీహళ్లి సబ్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ హయాంలో కరువొస్తే వెంటనే స్పందించి నష్టపరిహారం, బీమా అందించేవాళ్లమన్నారు. కానీ చంద్రబాబు పరిహారం రాకుండా చేసేందుకు రక్షక తడులు ఇచ్చినట్లు కేంద్రానికి నివేదిక పంపారన్నారు. కర్ణాటకలో ఇప్పటికే కరువు మండలాలు ప్రకటించారని, ఇక్కడ మాత్రం నేటికీ జాబితా విడుదల చేయలేదని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సీఎం ఉండటం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. ఆయన వెంట కన్వీనర్‌ మహేంద్ర, మాజీ కన్వీనర్‌ సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహయ్య, మాజీ సర్పంచు చిక్కవన్నప్ప, నాయకులు క్వారీ యజమానులు నవీన్, షరీఫ్, త్యాగరాజు తదితరులు ఉన్నారు.

 

Advertisement
Advertisement