– ప్రమాద స్థలాలను చేరడంలో జాప్యం చేయొద్దు
– సాంకేతికతను అందిపుచ్చుకోండి
– సిబ్బందికి అగ్నిమాపక శాఖ
డీజీ సత్యనారాయణ రావు ఆదేశం
కర్నూలు(రాజ్విహార్): విపత్తు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్ఎస్) కె. సత్యనారాయణ రావు సిబ్బందికి అదేశించారు. శుక్రవారం కర్నూలుకు తొలిసారిగా వచ్చిన ఆయన స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల డీఎఫ్ఓ, ఏడీఎఫ్ఓ, ఎస్ఎఫ్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం ఎలాంటిదైనా అలసత్వం ప్రదర్శించరాదన్నారు రోజురోజుకు విస్తరిస్తున్న సాంకేతికను అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలని, ప్రమాద సమాచారం అందిన వెంటనే శరవేగంగా ఘటన ప్రాంతానికి చేరుకోవాలన్నారు. తక్కువ సమయాల్లో చేరుకునే మార్గాలను అనుసరిస్తే విపత్తు తీవ్రతను తగ్గించవచ్చని సూచించారు. నదులు, రిజర్వాయర్లు తీర ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు జాకెట్ ప్రూప్స్, బోటులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. సిబ్బందికి ఆధునిక శిక్షణ ఇచ్చేందుకు ఇతర రాష్ట్రాలకు పంపించనున్నట్లు వెల్లడించారు. ఇకపై రెగ్యులర్గా సమీక్షలు నిర్వహించి పురోగతులపై చర్చిస్తామన్నారు. సమావేశంలో కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లా ఫైర్ అఫీసర్లు భూపాల్ రెడ్డి, విజయకుమార్, మూడు జిల్లాల సహాయ అధికారులు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.