- తోటల్లో సస్యరక్షణ చర్యలు, తెగుళ్లను నివారిస్తే అధిక దిగుబడులు
- బొప్పాయికి మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు.
- నీరు నిలిచే భూముల్లో కాండం కుళ్లు ఆశిస్తుంది.
- నీరు నిల్వ ఉండని నల్ల గరప, ఎర్ర నేలలు అనుకూలం
- నేల ఉదజని సూచిక 6.5 నుంచి 8.0 వరకు ఉండాలి.
- పొలంలో బొదెలు తీసి నీరు వెళ్లే ఏర్పాటు చేసుకోవాలి.
- మొదళ్ల వద్ద నీరు ఎక్కువగా నిలిస్తే మొదలు కుళ్లు తెగులు ఆశిస్తాయి.
- దీంతో మొక్కలు దెబ్బతిని పసుపు రంగు మారుతాయి.
- తెగులు నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటి చొప్పున కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.
- బొప్పాయి మొదళ్ల దగ్గర మట్టి ఎగదొసి డబుల్ రింగ్ పద్ధతిలో నీరు పెట్టాలి.
- డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ఇంకా మంచిది.
- బొప్పాయి తొటలకు ఆకు మచ్చ తెగులు ఆశిస్తే ఆకులపై తెల్లని గుండ్రని మచ్చలు ఏర్పడుతాయి.
- వీటి నివారణకు2.5 గ్రాముల డైథేన్ ఎమ్-45 లీటరు నీటి చోప్పున కలిపి ఆకులు తడిసేలా పిచికారి చేయాలి.
- మాడు తెగులు ఆశిస్తే కార్బండజిమ్ ఒక గ్రాము లీటరు నీటి చొప్పున కలిపి చెట్టు తడిసేలా పిచికారి చేయాలి.
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రాంతంలో రైతులు వాణిజ్యపంటగా బొప్పాయిని పండిస్తున్నారు. బొప్పాయిని అంతరపంటతో పాటు విడిగాను పండిస్తారు. నీరు నిల్వలేని నల్ల , ఎర్రనేలలు ఇందుకు అనుకూలం. బొప్పాయికి తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది. వీటి నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్ కుమార్ (7288894426) తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బొప్పాయి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
ఎరువుల వాడకం
మొక్కలు నాటేటప్పుడు పశువుల ఎరువుతో పాటు 250 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 500 గ్రాముల పొటాష్ నిచ్చే ఎరువులను మొక్కలు నాటిన రెండో నెల నుంచి 45 రోజులకు ఒక సారి ఆరు దఫాలుగా వేయాలి. మొక్క వయసును బట్టి 25 నుంచి 50 సెం. మీ దూరంలో గాడి తీసి ఎరువులను వేసి మట్టితో కప్పాలి. ఒక్కొక్క మొక్కకు ప్రతి సారి 100 గ్రాముల యూరియా, 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్.140 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి.