భర్తకు టీ ఇచ్చి... తను విషం తాగి... | Sakshi
Sakshi News home page

భర్తకు టీ ఇచ్చి... తను విషం తాగి...

Published Sat, Apr 30 2016 11:13 PM

bride suicide, Who does not like to have the wedding of the

► ఇష్టం లేని పెళ్లి చేశారని నవవధువు ఆత్మహత్య

జగదేవ్‌పూర్:
కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇష్టం లేని పెళ్లి చేశారని కన్నవాళ్లను వదిలి అనంతలోకాలకు వెళ్లింది. పచ్చని పందిరిలో వేద మంత్రాలు, వాయిద్యాల మధ్య జరిగిన పెళ్లి సంబురం తీరకముందే రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. చివరిగా తాళి కట్టిన భర్తకు టీ ఇచ్చి బాత్‌రూంలోకి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.

జగదేవ్‌పూర్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన గుర్రాల నర్సింహులు,లక్ష్మి దంపతుల కూతురు రేణుక ఇటివలే డిగ్రీ పూర్తి చేసింది. వర్గల్ మండలం జబ్బాపూర్‌కి చెందిన రంగస్వామితో రేణుకకు గురువారం పెళ్లి జరిగింది. పెళ్లి, విందు రోజు బాగానే ఉన్నా.. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపంలో రేణుక ఉంది. విషయం మాత్రం ఇంట్లో వారికి చెప్పలేదు. శుక్రవారం జబ్బాపూర్ గ్రామంలో విందు అనంతరం అదే రాత్రి చేబర్తి వచ్చారు.

ఉదయం వరకు బాగానే ఉండి భర్త స్వామికి టీ ఇచ్చి బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. అర గంటైనా రాకపొవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు తలుపులు తట్టారు. ఎంతకూ తలుపులు తీయకపోవడంతో వాటిని తీసి లోపలికి వెళ్లి చూడగా రేణుక అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కళ్ల ముందే కన్నబిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

Advertisement
Advertisement