– నేత్రపర్వంగా రాధాష్టమి వేడుకలు
– వైభవంగా ప్రత్యేక పూజలు
తిరుపతి కల్చరల్ : ఇస్కాన్ మందిరంలో శుక్రవారం రాధాష్టమి వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. కృష్ణాష్టమి తర్వాత 15వ రోజు రాధాదేవి ఆవిర్భావ దినోత్సవం (రాధాష్టమి) నిర్వహించడం ఆనవాయితీ. ఏడాదిలో రెండు సార్లు రాధాదేవి అమ్మవారి దివ్య పాద దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. శ్రీ రాధాష్టమి నాడు, కార్తీక మాసంలో వచ్చే గోపాష్టమి నాడు భక్తులు రాధాదేవి దివ్యపాద దర్శనం చేసుకొని తరిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం కమల మందిరంలో రాధాకృష్ణులకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాభిషేకం చేపట్టారు. బృందావనాన్ని తలపించేలా రాధాకృష్ణులతో పాటు గోపికలను వివిధ పుష్పాలు, ఫలాలతో సర్వాంగ సుందరంగా కొలువుదీర్చారు. శ్రీరాధా దేవిని ప్రత్యేకంగా ఫల, పుష్పాలు, పట్టుపితాంబర వస్త్రధారణలతో సుందరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వందలాది మంది భక్తులు రాధాదేవి దివ్యపాద దర్శనం చేసుకొని భక్తిపారవశంతో పులకించారు. హరినామ సంకీర్తనలు, భజనలు మార్మోగాయి. ఇస్కాన్ అధ్యక్షుడు రేవతీ రమణదాస్ శ్రీరాధాష్టమి విశిష్టతను తెలియజేశారు. భక్తులకు ఇస్కాన్ నిర్వాహకులు ప్రసాద వితరణ చేశారు.