దొంగల ముఠా అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

దొంగల ముఠా అరెస్ట్‌

Published Fri, Sep 30 2016 11:28 PM

Burglar gang arrested

కడప అర్బన్‌ : కడపలో కొంత కాలంగా జరుగుతున్న చోరీలను అరికట్టేందుకు కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో వన్‌టౌన్‌ సీఐ రమేష్, తమ సిబ్బందితో కలిసి దొంగల ముఠాను అరెస్టు చేశారు. వీరిని గురువారం వైవీ స్ట్రీట్‌లోని బంగారు నగల దుకాణం ఎదుట అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడపలో 14 చోట్ల దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్తుడు ఆవుల సాయిప్రసాద్‌రెడ్డి, అస్లంబాషా, మాబు, చాన్‌బాషా, ముబారక్, మహ్మద్‌ ఖలీద్, చంద్ర, షేక్‌ ఈలు ఉన్నారు. 2016 జూన్‌ 22న బ్రాహ్మణ వీధిలోని ఓ ఇంటిలో జరిగిన నేరంపై విచారణ చేస్తుండగా ఆ ప్రదేశంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజిలో.. నేరస్తులు ఆటోలో వచ్చి దొంగతనం చేసి అదే వాహనంలో పారిపోవడం నిక్షిప్తమైంది. అప్పటి నుంచి గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. వీరు కడపలో 14 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి 19 తులాల బంగారు ఆభరణాలు, 780 గ్రాముల వెండి ఆభరణాలు, రూ. 81 వేలు, మూడు టీవీలు, ఒక మానిటర్, సీపీయూ, రెండు హ్యాండీకామ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన వస్తువులను బంగారు వ్యాపారి హుసేన్‌బాషాకు ఇస్తున్నట్లు విచారణలో తెలియడంతో అతన్ని కూడా అరెస్టు చేశామని సీఐ తెలిపారు. సమావేశంలో వన్‌టౌన్‌ సీఐ రమేష్, ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి, ఏఎస్‌ఐ నౌషాద్, సిబ్బంది పాల్గొన్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement