హైదరాబాద్: కలకలం సృష్టించిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో నిందితులను ఆదివారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలోకి సీబీఐ అధికారులమంటూ వచ్చి పట్టపగలే ఆరుగురు దుండగులు భారీ దోపిడీ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులను మారణాయుధాలతో బెదిరించి ఈ దోపిడీకి పాల్పడ్డారు.
దుండగులు నలుపు రంగు స్కార్పియో కారులో వచ్చారని, ఇద్దరు వ్యక్తుల చేతుల్లో తుపాకులు ఉన్నట్టు సిబ్బంది ఆ సమయంలో వివరాలు ఇచ్చారు. తమను గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను కూడా దొంగలు ధ్వంసం చేశారు. అయితే, అదే రోజు సాయంత్రంలోగా వారు వెళుతున్న వాహనం ఆధారాలు గుర్తించిన పోలీసులు అనంతరం వారి ఊహాచిత్రాలు కూడా విడుదల చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. వారిని తాజాగా కర్ణాటకలోని గుల్బార్గాలో అదుపులోకి తీసుకొని ఆ ముఠా మొత్తాన్ని హైదరాబాద్కు తరలించారు. సీసీకెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించినట్టు సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య వివరించారు. నిందితుల నుంచి 3.5 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉపయోగించిన స్కార్పియో కారు, బైక్లను సీజ్ చేశారు.