‘జల్‌’ఫోన్‌..! | Sakshi
Sakshi News home page

‘జల్‌’ఫోన్‌..!

Published Thu, Sep 22 2016 11:35 PM

స్టార్టర్‌కు ఆనుసంధానం చేసిన కిసాన్‌రాజా కంట్రోలర్‌,  పైపునుంచి వస్తున్న జలధారను చూస్తున్న రైతులు

  • మొబైల్‌తో రింగిస్తే నడిచే విద్యుత్‌ మోటార్‌
  • సత్తుపల్లిలో ఆసక్తిగా పరిశీలించిన రైతాంగం
  •  
    సత్తుపల్లి:  ఇంట్లో కూర్చొని..మొబైల్‌ ఫోన్‌లో మీటా నొక్కితే..టిక్కెట్ల బుకింగ్‌, బ్యాంక్‌సేవలు, ఆన్‌లైన్‌ సౌకర్యాలే కాదు..ఇకపై చేలకాడ ఉన్న కరెంట్‌ మోటార్లను కూడా నడిపించొచ్చంట. సత్తుపల్లిలో మోటార్‌కు ప్రత్యేక పరికరం అమర్చి..సెల్‌ఫోన్‌తో రింగిచ్చి దానిని ఆన్‌చేసే విధానం వివరించారు. హైదరాబాద్‌ నుంచి తెప్పించిన ఈ పరికరాన్ని జేడీఈ కె.జీవన్‌కుమార్‌ పరీక్షించారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ‘మొబైల్‌ మోటార్‌’ విశేషాలేంటంటే.. 
    హైదరాబాద్‌కు చెందిన విన్ఫినెట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కిసాన్‌రాజా పేరుతో మొబైల్‌ మోటార్‌ కంట్రోలర్‌ను రూపొందించింది. సత్తుపల్లి విద్యుత్‌శాఖ ఏడీఈ కె.జీవన్‌కుమార్‌కు స్నేహితులైన ఈ సంస్థ నిర్వాహకులు దిన్నెపు విజయభాస్కర్‌రెడ్డి గురువారం ఇక్కడికి తెచ్చారు. సత్తుపల్లి మండలం సదాశివునిపేటలో ప్రయోగాత్మకంగా వ్యవసాయ విద్యుత్‌ మోటారుకు అనుసంధానం చేసి డెమో చేయగా రైతులు ఆసక్తిగా తిలకించారు. కంపెనీ ప్రతినిధి విక్రమ్‌రెడ్డి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏడీఈ జీవన్‌కుమార్‌, ఏఈలు ప్రభాకర్‌, అంకారావు, పైడయ్య, సుబ్రమణ్యం, సర్పంచ్‌ మందపాటి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఎంపీటీసీ వినుకొండ కృష్ణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు చల్లగుళ్ల నర్సింహారావు, రైతులు పాల్గొన్నారు. 
    • మోటార్‌ వద్ద సిమ్‌ పెట్టే..
    • రింగిస్తే నీళ్లు పోసే..
    - విద్యుత్‌ మోటర్‌కు కిసాన్‌రాజా పరికరాన్ని అమర్చారు. 
    - అందులో సిమ్‌ను పెట్టి దానికి అనుసంధానంగా సంబంధిత రైతు సెల్‌ఫోన్‌తో అనుసంధానం చేశారు. 
    - ఆ తర్వాత సెల్‌ఫోన్‌తో ఆ నంబర్‌కు రింగివ్వగా..వెంటనే విద్యుత్‌ మోటార్‌ ఆన్‌ అయి నీళ్లు పోసింది. 
    - విద్యుత్‌ ఓల్టేజీ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు, విద్యుత్‌ తీగలు తెగినప్పుడు, బోరులో నీళ్లు మోటారుకు అందనప్పుడు సెల్‌కు మెసేజ్‌ వస్తుంది. 
    - తద్వారా మోటారు కాలిపోకుండా జాగ్రత్త పడే అవకాశం లభిస్తుంది. 
    - విద్యుత్‌ సరఫరా ఉందా.. లేదా..? మోటారు నడుస్తుందా.. లేదా..? అనే సమాచారం కూడా సెల్‌కు మెసేజ్‌ రానుంది. 
    - మోటార్లు, స్టార్టర్ల దొంగతనం జరిగినప్పుడు హెచ్చరిస్తూ ఎస్‌ఎంఎస్‌ రైతు మొబైల్‌కు వస్తుంది. 
    - ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2500 విద్యుత్‌మోటార్లకు ఈ సిమ్‌ సిస్టం అమర్చినట్లు కంపెనీ ప్రతినిధి విక్రమ్‌రెడ్డి వివరించారు. 

Advertisement
Advertisement