కేంద్ర పథకాలను బాబు హైజాక్‌ | Sakshi
Sakshi News home page

కేంద్ర పథకాలను బాబు హైజాక్‌

Published Fri, Jul 29 2016 9:44 PM

కేంద్ర పథకాలను బాబు హైజాక్‌ - Sakshi

అంగర(కపిలేశ్వరపురం):
కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న పలు పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైజాక్‌ చేస్తున్నారని బీజేపీ రాష్ట్రనేతలు ఆరోపించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్రి చిట్టిబాబు, ఆర్‌వీ నాయుడు,  రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు కోన సత్యనారాయణ , జిల్లా కమిటీ సభ్యుడు బండారు సూరిబాబు శుక్రవారం అంగరలో విలేకరుల సమావేశంలో ఆవివరాలను తెలియజేశారు. ప్రధాని మోదీ స్వచ్చభారత్‌ అంటే సీఎం చంద్రబాబునాయుడు స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్‌ అంటూ కార్యక్రమాలు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్, 13, 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినవాటిగా ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమాలు వేటికీ స్థానిక బీజేపీ నేతలను కనీసం పిలవడం కూడా లేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల బీజేపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇదే వైఖరిని అవలంబిస్తే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. మండల స్థాయి నాయకులు ఎం.వీర్రాజు చౌదరి, ఎం.పుల్లయ్య చౌదరి, నంబుల వెంకన్న పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement