దుబ్బాక/ దుబ్బాక రూరల్ : గీత కార్మిక కుటుంబాలకు వెన్ను దన్నుగా నిలిచేందుకు సాక్షి ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘ఈత వనాల పండుగకు చిట్టాపూర్లో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శనివారం దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో వేదిక నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ఈదుల గుడ్డంలోని ఐదెకరాల్లో 5 వేల ఈత వనాలను ఒకే సారి నాటడానికి ‘సాక్షి’ సమాయత్తం చేయగా జిల్లాలోని ప్రతి గౌడ, కల్లు గీతా కార్మికులు చిట్టాపూర్కు తరలుతున్నారు. శుక్రవారం రాష్ట్ర అంచనా పద్దుల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మా ఊరిలో జరిగే మొక్కల పండగకు గీత కార్మిక సోదరులు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావుగౌడ్, మండలి చైర్మన్ స్వామి గౌడ్, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్గౌడ్, చింత ప్రభాకర్ తదితరులు హాజరవుతున్నారు . మొక్కలు నాటడమే కాకుండా గీతా కార్మికులకు జీవనోపాధి కల్పించాలనే సరికొత్త ఆలోచనతో ‘సాక్షి’ ముందుకు వచ్చింది. అందుకు సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్ను ఎంచుకుంది.
ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గీత కార్మికులు ఈత మొక్కలు నాడటం వల్ల ప్రతి ఒక్కరికీ ఉపాధి లభిస్తుంది. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్న ప్రతి గీత కార్మికునికి ఉపాధి లభిస్తుంది. మొక్క నాటడానికి గుంతలు తీసినందుకు రూ.17.80పైసలు, మొక్క నాటితే రూ.3.55పైసలు, నర్సరీ నుంచి మొక్కలు వాహనంలో తీసుకు రావడానికి ప్రతి మొక్కకు రూ.90పైసలు, మొక్కను నీళ్ళు పోసి పెంచితే రెండు సంవత్సరాలవరకు ఒక్కొక్క మొక్కకు నెలకు రూ.5 చొప్పున చెల్లిస్తారు. మండలంలోని రఘోత్తంపల్లిలో ఉన్న నర్సరి నుండి వెయ్యి ఖర్జుర మొక్కలు, బల్వంతాపూర్ నర్సరి నుంచి నాలుగు వేల ఈత మొక్కలు తెప్పించారు.