పోచమ్మమైదాన్ : కలకత్తా నుంచి హైదారాబాద్ వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ రైలు నుంచి అదుపులోకి తీసుకున్న 74 మంది బీహార్ బాలురలను ఎట్టకేలకు ఆదివారం రాత్రి విడుదల చేశారు. హైదారాబాద్లోని పలు కర్మాగారాల్లో పనులు చేయించేందుకు బాలలను తీసుకెళ్తున్నట్లు చైల్డ్కేర్కు సమాచారం అందడంతో శనివారం మధ్యాహ్నం వారితో పాటు తీసుకెళ్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, రంజాన్ పండగకు స్వగృహాలకు వెళ్లి, తిరిగి మదర్సాలకు వెళ్తున్న పిల్లలను అదుపులోకి తీసుకున్నారని, వారిని వెంటనే విడుదల చేయాలని వరంగల్ ఎంజీఎం జంక్షన్లో ముస్లింలు ఆదివారం రాస్తారోకో చేశారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు వారిని చెదరగొట్టగా జూవైనల్ హోంకు చేరుకున్నారు.
మదర్సాకు వెళ్తున్న వారిని ఆకారణంగా అరెస్ట్ చేశారని లెలుసుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, డిప్యూటీ మేయర్ సిరాజోద్దిన్ జూవైనల్ హోంకు వెళ్లి బాలుర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి విడుదల కోసం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, పోలీస్ కమిషనర్ సుధీర్బాబుతో మాట్లాడారు. దీంతో బాలురను విడుదల చేసేందుకు పోలీసులు అంగీకరించారు. అదుపులోకి తీసుకున్న బాలుర వివరాలను సోమవారం అందజేస్తామని క్రైం ఏసీపీ ఈశ్వర్రావు రాతపూర్వకంగా జూవైనల్ హోం అధికారులకు తెలియజేయడంతో వారిని విడుదల చేశారు.