చదువే పెద్ద ఆస్తి | Sakshi
Sakshi News home page

చదువే పెద్ద ఆస్తి

Published Tue, Apr 4 2017 2:59 AM

చదువే పెద్ద ఆస్తి - Sakshi

జీవితానికి ‘బాట’ వేయాలి
కామారెడ్డి కలెక్టర్‌ సత్యనారాయణ  


సదాశివనగర్‌ (ఎల్లారెడ్డి): అన్నిటి కంటే చదువే పెద్ద ఆస్తి అని, ఆ చదువుతోనే తలరాత మార్చుకోవచ్చని  కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ‘బడిబాట’ కార్యక్రమం చిన్నారుల జీవితానికి రాచబాట కావాలని ఆకాంక్షించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని తిర్మన్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ కావాలంటే మొదట చదువు ముఖ్యమని చెప్పారు. రాష్ట్రంలో అతి తక్కువ అక్షరాస్యత జిల్లాగా కామారెడ్డి ఉందని, దీన్ని మార్చేందుకు ప్రతీ ఒక్కరు చదువుకోవాలని సూచించారు. తాను ఐఏఎస్‌ కావడానికి తన తల్లిదండ్రులు పెద్దగా కష్టపడలేదని, ఎక్కువ డబ్బులు ఖర్చు చేయలేదని తన విద్యాభాస్యం మొత్తం ప్రభుత్వ బడిలోనే కొనసాగిందని గుర్తు చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, అదే ప్రైవేట్‌ పాఠశాలలో కనీస విద్యార్హత లేని ఉపాధ్యాయులతో బోధన చేయిస్తారన్నారు. ప్రైవేట్‌లో చదివితే చేతిలో బ్యాగ్‌ పట్టుకొని తిరగాల్సి వస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో చదివితే నాలాగా కలెక్టర్‌గా ఉన్నత స్థానంలో నిలబడటానికి అవకాశం ఉంటుందన్నారు. తమ పిల్లలను వేల రూపాయలు వెచ్చించి ప్రైవేట్‌ బడులకు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కలెక్టర్‌ సూచించారు. పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించి విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్న హెచ్‌ఎం రాజు, నందకిషోర్‌ను కలెక్టర్‌ అభినందించారు. ఢిల్లీ పబ్లిక్‌ పాఠశాలల్లో లేని మాస్టర్‌ డిగ్రీ చేసిన నిష్ణాతుడు నందకిషోర్‌ మీ గ్రామ పాఠశాలలో ఉండడం అదృష్టంగా భావించాలన్నారు. 

డీఈవో మదన్‌మోహన్, తహసీల్దార్‌ అమీన్‌సింగ్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో యోసెప్, జెడ్పీటీసీ సభ్యుడు రాజేశ్వర్‌రావ్, విశ్రాంత ఎంపీడీవో విఠల్‌రావ్, సర్పంచ్‌ సురేశ్, ఉప సర్పంచ్‌ వెంకయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్‌ నారాయణ, వీడీసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, విండో డైరెక్టర్లు భాస్కర్‌రెడ్డి, రాజయ్య, పాల కేంద్రం అధ్యక్షుడు సంజీవరెడ్డి, మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్‌ పెద్దొల్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement