ఎంసెట్ లీకుపై సీబీఐ విచారణ జరిపించాలి: కాంగ్రెస్ నేతలు | Sakshi
Sakshi News home page

ఎంసెట్ లీకుపై సీబీఐ విచారణ జరిపించాలి: కాంగ్రెస్ నేతలు

Published Sat, Jul 30 2016 3:34 PM

Congress demands to CBI probe on TS EAMCET-2

హైదరాబాద్: మల్లన్నసాగర్ కు వెళ్తున్న నేతలను అరెస్టు చేయడం అన్యాయమని కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకరరెడ్డిలు అన్నారు. యూనివర్సిటీలకు వీసీల నియామకాలపై హైకోర్టు తీర్పు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సర్కారుకు చెంపపెట్టని విమర్శించారు. కేసీఆర్ అసమర్ధ పాలన వల్లే ఎంసెట్-2 పేపర్ లీకైందని, లీకుకు మేగ్నట్ ఇన్ఫోటెక్ కు ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. అర్హత లేని సంస్థకు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని దుయ్యబట్టారు. మేగ్నట్ ఇన్ఫోటెక్ కు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావుకు సంబంధాలున్నాయని ఆరోపణలు ఉన్నాయని, ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో పాటు వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు ఎంసెట్ లీకుకు బాధ్యులను చేస్తూ కేబినేట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని అన్నారు.

మరోవైపు మెదక్ జిల్లా నుంచి మల్లన్నసాగర్ కు బయలుదేరిన లాయర్ల బృందాన్ని ఒంటిమిట్ట వద్ద అడ్డుకున్న పోలీసులు ములుగు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వవైఖరికి నిరసనగా న్యాయవాదులు ఒంటిమిట్టలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ కారు రాస్తారోకో చేస్తున్న లాయర్ల బృందం మీదుగా దూసుకుపోయింది. ప్రమాదంలో హైకోర్టు అడ్వకేట్ ప్రసాద్ కు గాయాలయ్యాయి. ఆగ్రహించిన న్యాయవాదులు పోలీసుల తీరును ఖండిస్తూ పీఎస్ ఎదుట ధర్నా చేశారు.

Advertisement
Advertisement