- విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు
రాజమహేంద్రవరం క్రైం :
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు ఏసీబీ కోర్టు జైలు శిక్ష విధించింది. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ రూరల్ మండల రెవెన్యూ ఆఫీసర్ మైలవరపు వెంకట సుబ్రహ్మణ్యంకు చెందిన కాకినాడ రూరల్లోని గృహాలు, ఆయన బంధువుల నివాసాలపై 1993లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడులలో రూ.13, 57,000 లక్షల విలువైన అక్రమ ఆస్తులను ఆయన కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసును విచారించిన విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి ఆలపాటి గిరిధర్ నిందితుడిపై నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.నాలుగు లక్షల జరి మానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు.
అలాగే మరో కేసులో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు వచ్చిన ఆరోపణలపై కాకినాడలోని సాంఘిక సంక్షేమశాఖ సూపరింటెండెంట్ వాసాది భాస్కరరావుకు చెందిన ఇళ్లు, ఆయన బంధువుల నివాసాలపై ఏసీబీ అధికారులు 1997 మార్చి 22న దాడులు చేశారు. ఆయన ఆదాయానికి మించి అదనంగా రూ.18,98,000 ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.ఈ కేసును విచారించిన విజయవాడ ఏసీబీ స్పెష¯ŒS కోర్టు జడ్జి ఆలపాటి గిరిధర్ భాస్కరరావును దోషిగా నిర్ధారించారు. ఆయనకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.నాలుగు లక్షల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని జడ్జి ఆ తీర్పులో పేర్కొన్నట్టు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు.