నల్లిని నలిపేయండిలా..! | Sakshi
Sakshi News home page

నల్లిని నలిపేయండిలా..!

Published Sun, Sep 11 2016 7:20 PM

నల్లిని నలిపేయండిలా..! - Sakshi

గత కొంత కాలంగా పంటలను చీడపీడలు అధికంగా ఆశిస్తున్నాయి. క్రిమిసంహారక మందులు వినియోగించిన వాటి ఉధతి తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా పత్తి పంటను నల్లిపురుగులు, పేనుబంక వంటివి అధికంగా ఆశించి దిగుబడికి నష్టం కలగజేస్తున్నాయి. వాటి నివారణకు మార్గాలను, అవి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను చెన్నూర్‌ వ్యవసాయ అధికారి ప్రేమ్‌కుమార్‌ తెలుపుతున్నారు. 
చెన్నూర్‌ రూరల్‌ : పత్తి పంటను ఆశించి నష్ట పరిచే రసం పీల్చే పురుగులలో ముఖ్యమైనది పిండినల్లి పురుగ. ఆగస్టు మాసం నుంచి అక్టోబర్‌ నెల వరకు పత్తి పంటను ఈ పురుగులు ఆశిస్తుంటాయి. వాటి పరిమాణం చిన్నగా ఉండి మెత్తగా, లేత గులాబీ రంగులో ఉంటాయి. అవి కొమ్మలు, కాండం, మొగ్గలు, కాయల నుంచి రసాన్ని పీల్చుతాయి.
     దీని ద్వారా మొక్కలలో సాధారణంగా జరిగే ఆవశ్యక మూలకాలు, పదార్థాల సరఫరాలో అంతరాయం ఏర్పడి మొక్కల ఎదుగుదల గిడస బారిపోతుంది. పిండినల్లి పురుగులు ముఖ్యంగా పొలంగట్లపై అలాగే పనికి రాని భూముల్లో పెరిగే కలుపు మొక్కల ద్వారా వ్యాపిస్తాయి. బెండ, టమాటా, వంగ, క్యాబేజీ, బొప్పాయి, నిమ్మ, జామ, మందార, గోగు, చామంతి, గడ్డి చామంతి, రామబాణం, వయ్యారి భామ, తుత్తర బెండ, సీతాఫలం, సుబాబుల్, గై ్లరిసీడియా వంటివి పిండినల్లికి అతిథి మొక్కలు.
పురుగుల వ్యాప్తి వెనుక కారణాలు..
  •  పురుగుపై తెల్లని మైనపు పొర ఉండటం చేత, అది పురుగు మందుల ప్రభావం నుంచి, ఇతర సహజ మరణం నుంచి రక్షణ పొందగలుగుతుంది. 
  •  ఈ పురుగు అధిక సంతానోత్పత్తి, అల్ప జీవితకాలం కలిగి ఉంటుంది. అదే విధంగా  ఒక సంవత్సర కాలంలో 15 తరాల అభివద్ధికి కారణమవుతుంది. అలాగే ఆడ పురుగు పెట్టే ఒక గుడ్ల సంచిలో దాదాపు 600 వరకు గుడ్లు ఉంటాయి. 
  •   పురుగు విసర్జించే తేనె వంటి ద్రవం కొరకు వచ్చే చీమల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు పిండినల్లి వ్యాపిస్తుంది. 
  •  అంతే కాకుండా పురుగు సహజంగా పంట ఉత్పత్తుల ద్వారా, పత్తి కర్రల ద్వారా గాలి, నీటి కాలువలు, వర్షం, పక్షులు, పశువుల ద్వారా వ్యాపిస్తుంది. మనుషులు ఈ పురుగులు ఆశించిన ప్రాంతం నుంచి ఆశించని ప్రాంతానికి తిరగడం ద్వారా కూడా వ్యాపిస్తుంది. 
  • నివారణ చర్యలు...
  •  సాధారణంగా పిండినల్లి పురుగులు మొదట గట్ల పక్కన ఉండే పత్తి వరుసల్లో అక్కడక్కడ ఆశించి తర్వాత మిగతా మొక్కలకు వ్యాపిస్తాయి. ఈ దశలో పురుగు ఆశించిన మొక్కలను పీకి కాల్చి వేయాలి. ఇలా చేయడం ద్వారా దాని విస్తరణను అదుపులో ఉంచవచ్చు.
  •  పొలం గట్లపైన ఉండే కలుపు మొక్కలు ముఖ్యంగా వయ్యారి భామ, తుత్తురబెండ, గడ్డి చామంతి, వంటి కలుపు మొక్కలను పీకి కాల్చి వేయాలి. జై గోగ్రామ బైకోలరేట్‌ మిత్ర పురుగులను హెక్టారుకు 500–1000 వరకు విడుదల చేయాలి. తద్వారా వయ్యారిభామ, కలుపు మొక్కలను నివారించవచ్చు.  దీని ద్వారా పిండినల్లి ఉధతి కూడా తగ్గించవచ్చు. 
  •  పత్తి ఏరిన తర్వాత వాటి కర్రలను పీకి కాల్చి వేయాలి.
  •  వేసవి దుక్కులు ద్వారా నేలలో దాగి ఉండే పిల్ల పురుగులను నియంత్రించవచ్చు. 
  •  అంతర పంటగా అలసంద, బబ్బెర, సోయాబీన్, మినుము వంటి పంటలను సాగు చేయడం ద్వారా మిత్ర పురుగుల సంఖ్యను వద్ధి చేయవచ్చ.
  •  కంచె పంటగా లేదా రక్షక పంటగా రెండు వరుసల సజ్జ లేదా కందులను దట్టంగా పెంచాలి. దీని ద్వారా ప్రధాన పంట అయిన పత్తిలో పిండినల్లి ఉధతి తగ్గించుకోవచ్చును.
  •  మొక్కలను పురుగు ఆశించినట్లయితే లీటరు నీటిలో 10 మి.లీ వేపనూనెతో పాటు ఒక గ్రాము సబ్బు పొడిని కలిపి 10 నుంచి 12 రోజుల తేడాతో మొక్క కాండం, కొమ్మలు, ఆకుల పైన అలాగే చుట్టు పక్కల మొక్కల పైన పిచికారీ చేయాలి.
  •  మోనోక్రోటోపాస్‌ నీరు 1:4 నిష్పత్తిలో కలిపిన ద్రావణాన్ని పంట విత్తిన 20, 40, 50 రోజుల వ్యవధిలో మొక్కల లేత కాండాలపై బ్రెష్‌తో పిచికారీ చేసినట్లయితే పిండినల్లిని సమర్థవంతంగా అరికటవచ్చు. తద్వారా మంచి దిగుబడులు పొందవచ్చు.
 

Advertisement
Advertisement