జీహెచ్ఎంసీలో మరణించిన వ్యక్తికి పదోన్నతి | Sakshi
Sakshi News home page

జీహెచ్ఎంసీలో మరణించిన వ్యక్తికి పదోన్నతి

Published Sat, Jul 30 2016 8:04 PM

dead man got promotion in ghmc

సాక్షి,సిటీబ్యూరో: అరె రషీద్‌ భాయ్‌కు ప్రమోషనొచ్చిందా.. మన జంగయ్యన్నకు కూడా వచ్చిందా.. అదేందిరా వాళ్లకెలా ఇస్తారు అని ఆశ్చర్యపోవడం మిగతావారి వంతైంది. అదేంటంటే.. జీహెచ్‌ఎంసీలో వాహనాల డ్రైవర్లుగా(లైట్‌ వెహికల్‌) పనిచేస్తున్న 78 మందికి పదోన్నతి కల్పించారు. వారిని హెవీ వెహికల్‌ డ్రైవర్లుగా నియమించారు. ఇందుకు సంబంధించిన జాబితా కూడా విడుదలైంది. సంతోషంగా తమ పేరును చూసుకున్న డ్రైవర్లు మరో ఇద్దరి పేర్లు చూసి షాక్‌ అయ్యారు. ఇదేంటి రషీద్‌కు ప్రమోషన్‌ ఇచ్చారా..! అరె జంగయ్యకు కూడా ఇచ్చారే అని డ్రైవర్లు చర్చించుకున్నారు.

అసలు విషయం ఏమిటంటే రషీద్‌ గతంలో మృతి చెందాడు.. జంగయ్య పదవీ విరమణ చేశాడు. మృతిచెంది, పదవీ విరమణ చేసిన వారికి కూడా మన జీహెచ్‌ఎంసీలో పదోన్నతులిస్తారా అని ఆశ్చర్యపోవడం డ్రైవర్ల వంతైంది. ఈ జాబితాకు స్టాండింగ్‌కమిటీ కూడా ఆమోదముద్ర వేయడం కొసమెరుపు. అయితే  ఈ పదోన్నతులు ఇంకా అమల్లోకి రాలేదని అడిషనల్‌ కమిషర్‌(అడ్మినిస్ట్రేషన్‌) రామకృష్ణారావు తెలిపారు.  ఇప్పటికే విధుల్లో లేని పారిశుధ్య కార్మికులను ఉన్నట్లు చూపుతూ, ఎప్పుడో మరణించిన వారి పేరిట సైతం నెలనెలా జీతాలు విడుదల చేస్తున్న బల్దియా అదే ధోరణిలో పాలన సాగిస్తోంది.
 

Advertisement
Advertisement