త్రిపురాంతకం: సాగర్ ప్రధాన కాలువ ద్వారా జిల్లాకు చేరాల్సిన నీటి సరఫరా రోజురోజుకూ తగ్గుతోంది. 2,300 క్యూసెక్కులతో ప్రారంభమైన నీటి సరఫరా శుక్రవారానికి 1,600కు తగ్గింది. స్థానిక ఎన్ఎస్పీ సబ్–డివిజన్లోని సాగర్ ప్రధాన కాలువ 83–5వ మైలు వద్ద శుక్రవారం నీటి విడుదలను అధికారులు పరిశీలించారు.
పరిస్థితి ఇలానే ఉంటే మరో మూడు, నాలుగు రోజుల్లో నీరు ఆగిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం గుంటూరు జిల్లా నుంచి రావాల్సిన నీరు అక్రమంగా తరలిపోవడమేనని రైతులు ఆరోపిస్తున్నారు. నీటి చౌర్యం జరుగుతున్నా జిల్లా యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదని, పైగా వచ్చిన నీటిని ఒంగోలు ప్రాంతానికి తరలిస్తున్నారని విమర్శిస్తున్నారు. గుంటూరు జిల్లాలో నీరు విడుదల చేసిన రోజే చెరువులను నింపేశారు.. కానీ జిల్లాలో ఇప్పటి వరకూ ఏ చెరువుకూ నీరు విడుదల చేయకపోవడం దారుణమన్నారు.
కేవలం ఎస్ఎస్ ట్యాంకులను నింపుతూ అధికారులు ఆనందపడిపోతున్నారని.. మరో వేసవిని తలపిస్తున్న వర్షాకాలంలో నీటి విడుదల ఆగితే తాగునీటి సమస్య జటిలమవుతుందని హెచ్చరించారు. అధికారులు గుంటూరు జిల్లా మేజర్లు మూయించి జిల్లాలో తాగునీటి చెరువులు నింపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.