సోమందేపల్లి : జిల్లాలో శాంతి భద్రతలు రోజు రోజుకూ క్షీణిస్తున్నాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అన్నారు. ఆదివారం జూలకుంటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడు బోయ సామాజిక వర్గానికి చెందిన ఓబుళేసు అనే వ్యక్తిని దారుణంగా దాడి చేసి చిత్రహింసలు పెట్టినా పోలీసులు ప్రేక్షకపాత్ర ఎందుకు పోషించారనిప్రశ్నించారు.
ఇటీవల కాలంలో జిల్లాలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోతున్నాయనీ, వారిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు పరచక పోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ తీరుపై విసుగెత్తిపోయిన ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావాలని బలంగా ఆకాంక్షిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకటరత్నం, నాయకులు తుంగోడు నారాయణరెడ్డి, అశ్వర్థమ్మ, నాయని శ్రీనివాసులు, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు.