పట్నంబజారు: కృష్ణా పుష్కరాల్లో భాగంగా శానససభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ బుధవారం శ్రీబాలచాముండిక సమేత అమరేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు, ప్రొటోకాల్లో భాగంగా ఆయన దర్శనం చేసుకునే సమయంలో క్యూలైన్లు నిలిపివేశారు. ఆయన కుటుంబ సపరివార సమేతంగా వచ్చారు. అర్బకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయం లోపల ప్రత్యేక పూజలు చేయించారు. ఈ క్రమంలో రూ. 100 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులను సాధారణ ఉచిత దర్శనం చేసుకోవాలని అధికారులు సూచించారు. అధికారుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు వెచ్చించి టిక్కెట్టు కొనుగోలు చేసిన తాము సాధారణ క్యూలో ఎందుకు వెళ్లాలంటూ.. నిలదీశారు. భక్తులు ఆగ్రహం చెందటంతో అధికారుల నోట మాట రాలేదు. దీంతో స్పీకర్ కుటుంబ సభ్యులను లోపలికి పంపించిన అనంతరం భక్తులను 100 క్యూలో పంపించారు.