కురుపాం : ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులతో పాటు మలేరియా, డయేరియా తగ్గుముఖం పట్టాయని స్టేట్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ అరుణకుమారి తెలిపారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని రేగిడి, దుడ్డుఖల్లు పీహెచ్సీలతో పాటు కొత్తవలస, రాయగఢ జమ్ము గ్రామాలతో పాటు గొరడలోని గిరిజన సంక్షేమ వసతిగహాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జ్వరాలతో ఎవరైనా బాధపడుతున్నదీ, లేనిదీ ఆరా తీశారు. అలాగే మలాథియాన్ పిచికారీ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే కురుపాం సీహెచ్ఎన్సీని సందర్శించి వైద్యాధికారి గౌరీశంకరరావుతో మాట్లాడారు. మలేరియా కేసుల నమోదుపై ఆరా తీశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, గత రెండు నెలలతో పోల్చి చూస్తూ ఏజెన్సీలో వ్యాధుల తీవ్రత తగ్గుముఖం పట్టిందన్నారు. కార్యక్రమంలో ఆమె వెంట క్షయ నివారణాధికారి టి. రామారావు, డీఎంఓ డాక్టర్ రవికుమార్, ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.