సమస్యల లోగిలి | Sakshi
Sakshi News home page

సమస్యల లోగిలి

Published Sat, Feb 25 2017 11:52 PM

Dreyineji pigs Colony problems

పక్కా ఇళ్లు కరువు..డ్రెయినేజీలు తెలియవు
రోడ్డుపైనే పారుతున్న మురుగునీరు
రెచ్చిపోతున్న పందులు
బుడిగజంగాల కాలనీ సమస్యలమయం


కొత్తపల్లి :
పూరిగుడిసెలు..కనిపించని డ్రెయినేజీలు..కంపుకొడుతున్న పరిసరాలు..ఇవన్నీ ఏదో మారుమూల ప్రాంతం అనుకుంటే పొరపాటే. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కొత్తపల్లి మండలం రేకుర్తి పంచాయతీ పరిధిలోని బుడిగజంగాలకాలనీ దుస్థితి. పక్కా ఇళ్లు లేక వ్యక్తిగత మరుగుదొడ్లకు నోచుకోలేక కాలనీవాసులతో సమస్యలతో సహవాసం చేస్తున్నారు. దాదాపు 400 కుటుంబాలు జీవిస్తున్న ఈ కాలనీలో కనీసం డ్రెయినేజీలు లేవు. బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించడంతోపాటు  వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు విన్నవిస్తున్నారు.

కరీంనగర్‌లోని గిద్దె పెరుమాండ్ల స్వామి దేవస్థాన భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసిస్తున్న బుడిగ జంగాలను రేకుర్తికి తరలించారు. 128 సర్వేనంబర్‌లో మొదటి విడతగా 148 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. మిగిలిన 250 కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు రద్దు కాగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకం కింద బుడిగ జంగాల కాలనీ ఎంపికవకపోవడంతో గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్నా వాటికి కనీస వసతుల్లేవు. 148 గృహాల్లో కేవలం 30 గృహాలకు మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి.

మిగతా వారు బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి. దీనికితోడు పాలిథిన్‌ కవర్లతో స్నానాల గదులను ఏర్పాటు చేసుకున్నారు. వీటినుంచి వచ్చే వ్యర్థ నీరు డ్రైనేజీలు లేక రోడ్లపైనే ప్రవహిస్తున్నాయి. అధ్వానంగా అంతర్గత రోడ్లుŠ, రోడ్లపై పారుతున్న మురికినీటితో కాలనీ కంపుకొడుతోంది. పక్కా ఇళ్లు లేకపోవడంతో స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద వ్యక్తిగత మరుగుదొడ్లకు అర్హత పొందలేకపోయారు. స్తంభాలు లేకపోవడంతో కర్రల మద్దతుతో సర్వీస్‌ వైర్ల ద్వారా విద్యుత్‌ పొందుతున్నారు. తాగునీటి ట్యాంకు ఉన్నా ఇంటింటికి పైప్‌లైన్‌ లేకపోవడంతో ప్లాస్టిక్‌ పైప్‌లను ఏర్పాటు చేసుకొని నీటిని వాడుకుంటున్నారు.

Advertisement
Advertisement