సొంత పార్టీ కాంట్రాక్టర్‌ లబ్ధి కోసం ఆరాటం | Sakshi
Sakshi News home page

సొంత పార్టీ కాంట్రాక్టర్‌ లబ్ధి కోసం ఆరాటం

Published Fri, Sep 16 2016 10:22 PM

సొంత పార్టీ కాంట్రాక్టర్‌ లబ్ధి కోసం ఆరాటం - Sakshi

– కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదా తాకట్టు 
– వైఎస్సార్‌సీపీ నేత ఉదయభాను ధ్వజం 
బాబూ.. పోలవరంపై నాటకాలొద్దు 
 
 
జగ్గయ్యపేట : చంద్రబాబు నాయుడు సొంత పార్టీ కాంట్రాక్టర్‌ లబ్ధి కోసమే జాతీయ హోదా గల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్రానికి తీసుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను శుక్రవారం విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే నాంది పలికారని ఒక ప్రకటనలో గుర్తుచేశారు. ఈ నెల 13న ప్రాజెక్టు పనుల పరిశీలనకు చంద్రబాబు వెళ్లారని, ఆ సమయంలో కాపర్‌ డ్యాం నిర్మించి పోలవరం కాల్వకు నీళ్లిస్తామని, 60 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని చెప్పి ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేశామని చెప్పుకోవటం రాజకీయ లబ్ది పొందటం కోసమేనన్నారు. ఆర్భాటంగా తొలిదశ పనుల కోసం నాణ్యత లేకుండా పనులు చేపడితే ఉద్యమిస్తామన్నారు. పోలవరం కాంట్రాక్టు చేజిక్కించుకోవడానికి ఏపీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని చంద్రబాబుపై నిప్పులుచెరిగారు. 
 
జనంలోకి వెళ్లలేని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు 
 ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఐదు కోట్ల ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసిందన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగానే అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా గ్రామాల్లో తిరగలేకపోతున్నారని ఎద్దేవాచేశారు. రాజధాని నిర్మాణం పేరుతో విదేశీ సంస్థల ద్వారా వేల కోట్ల అక్రమార్జనకు పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ప్రజలు కూడా ప్రత్యేక హోదా కోసం, ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.  
...........................
 
 

Advertisement
Advertisement