పేద విద్యార్థులను ప్రోత్సహించండి | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులను ప్రోత్సహించండి

Published Tue, Aug 30 2016 11:09 PM

పేద విద్యార్థులను ప్రోత్సహించండి - Sakshi

కోసిగి: ప్రతి ఒక్కరు తమ సంపాదనలో పేద విద్యార్థుల చదువుకు కొంత కేటాయిస్తే మహా పుణ్యం లభిస్తుందని ముస్లిం మైనార్టీ వక్ఫ్‌బోర్డ్‌ కమిషనర్‌ ఎస్‌.ఎండీ ఇక్బాల్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కోసిగిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  తన బాల్యం 10వ తరగతి వరకు కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో సాగినట్లు తెలిపారు. చదువుకున్న పాఠశాల కోసం తమ వంతుగా సాయం చేద్దామని ఉద్దేశంతోనే విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. అనంతరం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యను నేర్పించే ఆపరేటర్‌కు ఏడాది పాటు జీతం రూ.60వేలు విరాళంగా అందించారు. అలాగే  రెండు కంప్యూటర్‌లు, స్పోర్ట్స్‌ కిట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పలువురు నాయకులు పాఠశాల అభివద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం పాఠశాల ఆవరణంలో చెట్లు నాటారు. అలాగే స్థానిక శ్రీ మార్కండేయ స్వామి ఆలయ కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసి ఉరుకుంద ఈరన్న ఉత్సవాలకు ట్రాఫిక్‌ లేకుండా సేవలు అందించిన నారాయణ  డిగ్రీ , ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు ఆయన అందజేశారు. అనంతరం స్థానిక పెద్ద మసీదు సమీపంలో మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు, జెడ్పీటీసీ సభ్యులు దళవాయి మంగమ్మ,  కోసిగి సర్పంచ్‌ ముత్తురెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పెండ్యాల ఆదినారాయణ శెట్టి, తహసీల్దార్‌ రజనీకాంత్‌ రెడ్డి, ఎంపీడీఓ వరలక్ష్మి, టీడీపీ నాయకులు పల్లెపాడు రామిరెడ్డి, వక్రాని వెంకటేశ్వర్లు,  సీఐ కంబగిరి రాముడు, ఎస్‌ఐ ఇంతియాజ్‌ బాషా, కిద్‌మతేమిల్లత్‌ రాష్ట్ర అధ్యక్షులు నవాజ్, తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement