అద్భుతంగా చర్లపల్లి రైల్వే టర్మినల్‌ | Sakshi
Sakshi News home page

అద్భుతంగా చర్లపల్లి రైల్వే టర్మినల్‌

Published Tue, Aug 30 2016 9:36 PM

అద్భుతంగా చర్లపల్లి రైల్వే టర్మినల్‌

సాక్షి, సిటీబ్యూరో: చర్లపల్లిలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ రైల్వే టర్మినల్‌ ప్రత్యేకతలివి. ఈ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవల నగరంలో పర్యటించిన రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు గ్రీన్‌ఫీల్డ్‌ రైల్వే టర్మినళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి.. చర్లపల్లి, వట్టినాగులపల్లిలో ఈ తరహా టర్మినళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లిలో నాలుగో టర్మినల్‌ నిర్మించాలని ప్రతిపాదించిన సంగతి  తెలిసిందే.

రూ.360 కోట్ల అంచనా వ్యయంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించనున్న ఈ టర్మినల్‌ కోసం రైల్వే శాఖ ఇప్పటికే రూ.30 కోట్లు కేటాయించింది. తాజాగా రైల్వే మంత్రి ప్రకటన నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో ఈ పర్యావరణహిత టర్మినల్‌ను అంతర్జాతీయ హంగులతో నిర్మించేం దుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
 

►    స్టేషన్‌ చుట్టూ గ్రీన్‌ఫీల్డ్‌ (పచ్చని పరిసరాలు) అభివృద్ధి చేస్తారు. కాలుష్యానికి తావులేకుండా ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తారు. బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు.
►    స్టేషన్‌ అంతటా సోలార్‌ లైట్లు ఏర్పాటు చేస్తారు. సోలార్‌ విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం.
►    భూగర్భ జలాల పెంపు, వాననీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు నిర్మిస్తారు. వాటర్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌లూ ఏర్పాటు చేస్తారు.
►     కాగిత రహిత స్టేషన్‌గా అభివృద్ధి చేస్తారు. టికెట్‌ వివరాలు ప్రయాణికులకు ఎస్సెమ్మెస్‌ రూపంలో పంపిస్తారు.  
►     రైళ్ల రాకపోకల వివరాలు, ఇతర ప్రకటనలు ప్రయాణికులు తెలుసుకునేందుకు ప్రతీ ప్లాట్‌ఫామ్‌లో డిస్‌ప్లే బోర్డులు ఉంటాయి.  
►    ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్, విశ్రాంతి గదులు తదితర సదుపాయాలు ఉంటాయి.

Advertisement
Advertisement