Sakshi News home page

విద్యుదాఘాతంతో యువరైతు మృతి

Published Fri, Aug 19 2016 9:50 PM

విద్యుదాఘాతంతో యువరైతు మృతి - Sakshi

మిర్యాలగూడ రూరల్‌: విద్యుదాఘతానికి యువ రైతు బలయ్యాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఎడ్జిఫీజ్‌ కొట్టెయడంతో దానిని పరిశీలించడానికి వెళ్లిన ఆ యువకున్ని ట్రాన్స్‌ఫార్మర్‌ కాటేసింది. ఈ సంఘటన మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకొంది. మిర్యాలగూడ రూరల్‌ ఎస్సై వి.సర్దార్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం గ్రామానికి  చెందిన బీరవోలు గిరిధర్‌రెడ్డి(35) రాత్రి 11 గంటల సమయంలో బోరుబావి విద్యుత్‌ మోటారును ఆన్‌ చేయడానికి వెళ్లాడు. మోటర్‌ పని చేయకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్‌  వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా విద్యాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో మృతుని తండ్రి మోహన్‌రెడ్డి బోరు వద్దకు వెళ్లాడు. అక్కడ కుమారుని బైకు ఉండి అతను కనిపించకపోవడంతో వెతికాడు. సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద సెల్‌లైట్‌ వెలుగుతుండడంతో అటువైపుగా వెళ్లాడు. అక్కడ కుమారుడు నిర్జీవంగా పడిఉండడంతో భయాందోళనతో ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు తెలిపాడు. వారంతా వచ్చి పరిశీలించగా అప్పటికే గిరిధర్‌ రెడ్డి మృతి చెంది ఉన్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొన్నమని ఎస్‌ఐ తెలిపారు. 
 

Advertisement

What’s your opinion

Advertisement