కామారెడ్డి: నిజామాబాద్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి సమీపంలో ఓ కారును రెండు లారీలు ఢీకొన్న ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై కామారెడ్డి పట్టణ బైపాస్ సర్కిల్ కేత్రియాల్ గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
మృతులు ప్రవీణ్, భరత్, నిఖిత నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నిర్మల్ వాసులు. అలాగే లక్ష్మణ్, హర్ష ఆర్మూరు మండలం ఆలూరుకు చెందినవారు. వీరంతా నిఖిత బీటెక్ అడ్మిషన్ కోసం హైదరాబాద్ వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ప్రమాద స్థలిని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, విప్ గోవర్ధన్ సందర్శించారు.