సంతకవిటి: మండలంలో గుళ్ళసీతారాంపురం గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మండల కేంద్రం సంతకవిటి నుంచి రాజాం వైపు వెళ్తున్న ఆటో మరో ఆటోను తప్పిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు బాధితులు తెలిపారు. గుళ్ళసీతారాంపురం దాటిన వెంటనే మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలం వద్ద ఒక ఆటో పూర్తిగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒక ఆటోలో ప్రయాణిస్తున్న మందరాడ గ్రామానికి చెందిన ముతికి విశ్వనాధం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈయన విజయవాడలో ఉంటున్నాడు. వినాయక చవితి ఉత్సవాల నిమిత్తం మందరాడ వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈయనకు ఒక కాలు పూర్తిగా విరిగిపోవడంతో పాటు చేతికి కూడా తీవ్ర స్థాయిలో దెబ్బ తగిలింది.
మరో ఆటోలో ప్రయాణిస్తున్న రేగిడి మండలం ఉంగరాడ గ్రామానికి చెందిన పి.లక్ష్మి అనే వృద్ధురాలు తీవ్ర గాయాల పాలై సంఘటనా స్థలం వద్దే స్పృహ కోల్పోయింది. వీరితో పాటు సంతకవిటి మండలంలో శ్రీహరినాయుడుపేట గ్రామానికి చెందిన వి.వరలక్ష్మి, గండ్రేటి ఆదినారాయణ కూడా గాయాల పాలయ్యారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా రాజాంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సంతకవిటి ఏఎస్ఐ బీవీ రమణతో పాటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితులు అందించిన వివరాలు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.