విషజ్వరంతో చిన్నారి మృతి | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో చిన్నారి మృతి

Published Mon, Sep 26 2016 11:51 PM

విషజ్వరంతో చిన్నారి మృతి - Sakshi

ధర్మవరం అర్బన్‌ : పట్టణంలోని దుర్గానగర్‌లో సోమవారం ఉదయం రెండేళ్ల చిన్నారి సఫియా విష జ్వరంతో మృతిచెందింది. వివరాల్లోకెళితే.. బాబు, అమీనా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె సఫియా నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. అక్కడ రక్తపరీక్షలు చేసి, సాధారణ జ్వరమని నిర్ధారించారు. చిన్నారి నీరసంగా ఉండటంతో కామెర్లు వచ్చాయని, సందులు అయ్యాయని భావించిన తల్లిదండ్రులు సోమవారం ఉదయం అంత్రంతోపాటు గాజుతో రచ్చ(కాల్చడం) పెట్టించారు.

అనంతరం ఇంటి వద్ద ఆడుకుంటున్న సఫియా ఉన్నట్లుండి కళ్లు తేలేసి కిందపడింది. తల్లిదండ్రులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రెండేళ్ల కూతురు కళ్లముందే చనిపోవడంతో ఆ తల్లి రోదన అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మునిసిపల్‌ అధికారులు దుర్గానగర్‌లో పర్యటించి మృతురాలి ఇంటి పరిసరాలను శుభ్రం చేయించారు. చిన్నారి కుటుంబ సభ్యుల వద్ద డిప్యూటీ డీఎంహెచ్‌వో వివరాలు సేకరించారు. వార్డు కౌన్సిలర్‌ లక్ష్మిదేవి, టీడీపీ నాయకులు బోయ రవిచంద్రలు బాధితులను పరామర్శించి ఓదార్చారు. 

Advertisement
Advertisement