పర్యాటకరంగానికి మన దేశం ఎంతో అనువైనదని, ఇక్కడ ప్రకృతి సంపదకు కొదవే లేదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు అన్నారు. యూనివర్సిటీలో డిపార్టుమెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. విదేశాలను తలదన్నే రీతిలో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని వనరులూ మన దేశంలో ఉన్నాయని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ రమేష్ అన్నారు. పర్యాటకరంగం ఆవశ్యకత, ప్రాముఖ్యం, అభివృద్ధి తదితర అంశాల గురించి విభాగాధిపతి డాక్టర్ ఎన్.ఉదయ్భాస్కర్ వివరించారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంపై విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం, పోస్టర్ ప్రజెంటేషన్లు నిర్వహించి, విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్స్ అందజేశారు. ఫొటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పర్యాటకరంగ అధ్యాపకులు కె.సాయిబాబా, ఐఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.