రైతుల సంక్షేమమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే లక్ష్యం

Published Mon, Sep 12 2016 10:37 PM

రైతుల సంక్షేమమే లక్ష్యం

  • సాగునీరు అందించి తీరుతాం
  • కోల్డ్‌స్టోరేజీలు, గోడౌన్‌ల నిర్మాణానికి పెద్దపీట
  • రాష్ట్ర మార్కెటింగ్‌ మంత్రి హరీష్‌రావు
  • కరీంనగర్‌:  రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, పథకాలను సద్వినియోగం చేసుకుని అన్నదాతలు అభివృద్ధి చెందాలని రాష్ట్ర మార్కెటింగ్, నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం స్థానిక మార్కెట్‌ యార్డులో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్కడాలేని విధంగా మార్కెట్‌కమిటీ పాలకవర్గం నియామకాల్లో రిజర్వేషన్‌ విధానాన్ని పాటించామని చెప్పారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నామని, రైతులకు ఉపయోగపడేలా గోడౌన్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టంచేశారు. జిల్లాలో 8 మార్కెట్‌యార్డుల్లో ఆన్‌లైన్‌ కోనుగోలు విధానం అమలుచేయనున్నట్లు వివరించారు. రైతుబంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో కోల్డ్‌స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఉత్తరాదిలో అమలు చేస్తున్న డ్రైయర్స్‌ విధానాన్ని జమ్మికుంట మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. జమ్మికుంట, హుజూరాబాద్‌ యార్డుల్లో ఆధునిక రైతు బజారులను ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. 
     
    గోదావరి జలాలు తీసుకొస్తాం..
    సాగు,తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రూ.25వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి ప్రతీ ఎకరాకు గోదావరి జలాలను తీసుకొస్తామని హరీశ్‌రావు అన్నారు. త్వరలోనే వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి వంటి మెట్టప్రాంతాలకు కాలువల ద్వారా 1.60 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 12 నుంచి 16 నెలల్లో పూర్తిచేసి కరీంనగర్‌లోని ప్రతీపొలానికి రెండు పంటలు పండేలా నీరందిస్తామని అన్నారు. ముంపు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని స్పష్టంచేశారు.
    – ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ అధికారాన్ని బాధ్యతగా స్వీకరించి రైతుల బాగోగులే లక్ష్యంగా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. ఉత్తరతెలంగాణ జిల్లాల్లోనే గొప్పగా కరీంనగర్‌ మార్కెట్‌యార్డును తీర్చిదిద్దేలా పనిచేయాలని సూచించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, మేయర్‌ రవీందర్‌సింగ్, సింగిల్‌విండో చైర్మన్‌ మంద రాజమల్లు మాట్లాడారు. అనంతరం మార్కెట్‌కమిటీ పాలకవర్గం చైర్మన్‌ గోగూరి నర్సింహారెడ్డి, వైస్‌చైర్మన్‌ ఎస్‌.రాజేశ్వర్‌రావు, 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. 
     
    ఎల్‌ఎండీలో రోడ్డు పనులకు శంకుస్థాపన
    ఎల్‌ఎండీ కట్టపైన రూ.1.60 కోట్ల విలువైన ఎల్‌ఎండీ కుడివైపు రోడ్డు పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. లైటింగ్, వాకర్‌ట్రాక్‌ ఏర్పాటుకు మరో రూ.1.40కోట్లు మంజూరు చేస్తామని అన్నారు. టీఆర్‌ఎస్‌జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, డెప్యూటీ  మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్, జñ డ్పీటీసీలు శరత్‌రావు, సిద్దం వేణు, ఎడ్ల శ్రీనివాస్, ఎంపీపీ వాసాల రమేశ్, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.  
    కన్నేపల్లిని దత్తత తీసుకుంటా... 
    కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలంలో నిర్మించే మేడిగడ్డ బ్యారేజీ ప్రధాన పంప్‌హౌస్‌  కన్నేపల్లిలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు కరీంనగర్‌లో భారీనీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును సోమవారం కలిశారు. భూములు కోల్పోవడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఎకరాకు రూ.15లక్షల పరిహారంతోపాటు కుటంబంలో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని వేడుకున్నారు. స్పందించిన మంత్రి హరీష్‌రావు అన్ని భూములకు ఒకే విధంగా పరిహారం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అర్హతకలిగిన యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కన్నేపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చినట్లు నిర్వాసితులు తెలిపారు. కన్నేపల్లి ఉపసర్పంచ్‌ శనిగరం మల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌ చిన్న మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement