రోడ్డున పడేశారు | Sakshi
Sakshi News home page

రోడ్డున పడేశారు

Published Tue, Oct 18 2016 11:52 PM

రోడ్డున పడేశారు

  • మూడు నెలల్లో కొత్త ఇళ్లు ఇస్తామని చెప్పారు
  • రెండేళ్లయినా ఆ ఊసే లేదు
  • సీఎం, కలెక్టర్, ఎమ్మెల్యేల హామీలు గాలికి
  • కోటిలింగాల ఘాట్‌ అనుసంధాన రోడ్ల బాధితుల ఆవేదన
  • పుష్కర సంబరాలు ముగియగానే ఇళ్లు ఇస్తామని ఉన్న గూడును తొలగిం చారు. ‘ఇదేమి అన్యాయ’మంటూ నిరసనలకు దిగడంతో పుష్కరాలు ముగియగానే కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎంతోపాటు జిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. పుష్కరాలు ముగిసి అంత్య పుష్కరాలు కూడా పూర్తయినా ఆ ఊసే లేదు. ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో 56 కుటుంబాలు రేకుల షెడ్లలో, మురికి కూపాల మధ్య దుర్భర జీవనాన్ని గడుపుతున్నారు. 
    సాక్షి, రాజమహేంద్రవరం: 
    గోదావరి పుష్కరాలకు భారీ వ్యయంతో అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేశంలోనే అతిపెద్ద కోటిలింగాల ఘాట్‌ను నిర్మించింది. ఇక్కడ గంటకు 1.5 లక్షల మంది స్నానం చేసేలా ఏర్పాట్లు చేసింది. 1.5 కిలోమీటర్లు పొడవు ఉన్న ఘాట్‌లోకి నగరం నుంచి వచ్చేందుకు ఆరు అనుసంధాన రోడ్లు నిర్మించింది. ఆ సమయంలో రోడ్లు వేసేందుకు అడ్డుగా ఉన్న 56 గృహాలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఆ సమయంలో బాధితులు ఆందోళనలు చేశారు.  మూడు నెలల్లో నూతన గృహాలు కట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, రాజమహేంద్రవరం నగర, రూరల్‌ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ బాధితుకుల హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు చేతల్లో చూపించకపోవడంతో వారంతా రోడ్డున పడ్డారు. 
    రేకుల షెడ్లలో నివాసం...
    బాధితుల గృహాలు తొలగించిన అధికారులు నూతన గృహాలు నిర్మించి ఇచ్చే వరకూ కోటిలింగాల ఘాట్‌ టింబర్‌ డిపో నుంచి బృహన్నలపేట వైపు వెళ్లే మార్గంలో దేవాదాయ శాఖ స్థలాన్ని అధికారులు చూపించారు. 56 కుటుంబాలు అక్కడ తాత్కాలికంగా రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు లేక అర కిలోమీటరు దూరంలో ఉన్న పేపర్‌ మిల్లు సర్కిల్‌లోని సులభ్‌ కాంప్లెక్స్‌ వద్దకు వెళుతున్నారు. చుట్టూ టింబర్‌ డిపోలు కావడం, పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉండడంతో విష సర్పాల సంచారం ఎక్కువగా ఉంది. విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో రాత్రి పూట బయటకు వెళ్లాలంటే ప్రాణ భయంతో వణికిపోతున్నారు. రాత్రి పది గంటల తర్వాత సులభ్‌ కాంప్లెక్స్‌ మూసివేస్తుండడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుక పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో ఆడపిల్లలు రాత్రి పూట భోజనం చేయడం మానివేశారని మహిళలు వాపోతున్నారు.
    మురికి కూపం.. పందుల స్వైరవిహారం..
    కనీస మౌలిక వసతులు లేకపోవడంతో మురుగు నీరు నివాసాల మధ్యే నిలిచిపోతోంది. పందులు మురుగు నీటిలో స్వైర విహారం చేస్తున్నాయి. దోమల వల్ల తరచూ పిల్లలు, పెద్దలు జ్వరాల బారిన పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా నివాస ప్రాంతాల మధ్య మోకాలు లోతులో నీరు నిలిచిపోతోంది. వర్షం తగ్గినా మూడు నాలుగు రోజులకు కూడా నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బురదలోనే వీరు అష్ట కష్టాలు పడుతున్నారు.  
    40 ఏళ్లుగా నివాసం.. పక్కా గృహాలు ధ్వంసం
    కోటిలింగాల ఘాట్‌ విస్తరించక ముందు గోదావరి గట్టుకు వెలుపల దేవాదాయ శాఖ స్థలంలో వీరు 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుని జీవించే వీరు రూపాయి రూపాయి కూడబెట్టుకుని పక్కా గృహాలు నిర్మించుకున్నారు. ప్రతి ఏడాది దేవాదాయ శాఖకు గజం స్థలానికి రూ.16 చొప్పన పన్నులు కట్టారు. గృహాలు తొలగించే  ఆరు నెలల ముందు కూడా కోటిలింగాల ఘాట్‌లోని దేవాదాయ శాఖ కార్యాలయంలో పన్నులు చెల్లించారు. అనుసంధాన రోడ్ల కోసం రూ. రెండు లక్షల విలువైన వీరి ఇళ్లను అధికారులు తొలగించారు. మూడు నెలల్లో కొత్త ఇళ్లు ఇస్తామని చెప్పి స్లిప్పులు ఇచ్చినా ఇప్పటి వరకు అతీగతీ లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని వాపోతున్నారు. కోటిలింగాల ఘాట్‌ విస్తరణ కోసం గోదావరి గట్టుపై నది వైపున పాకలు వేసుకుని నివాసం ఉంటున్న 96 మత్య్సకార కుటుంబాలను కూడా ఖాళీ చేయించారు. వారికి రోడ్లు భవనాల శాఖ స్థలంలో నిర్మించిన వాంబే గృహాలను కేటాయించారు. కానీ గట్టు వెలుపల అనుసంధాన రోడ్ల కోసం తొలగించిన బాధితులకు మాత్రం ఇప్పటి వరకూ న్యాయం చేయలేదు.
     
    పుష్కరాలు ముగియగానే ఇస్తామన్నారు 
    పుష్కరాల ఏర్పాట్లకు ఇళ్లు తొలగిస్తున్నామన్నారు. మేము ఒప్పుకోకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వచ్చి పుష్కరాలు ముగియగానే కొత్త ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. రెండేళ్లయినా ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. 
    – ఎన్‌. సూర్యకుమారి, బాధితురాలు
    తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం
    ఇళ్లు కట్టించే వరకు ఇక్కడ ఉండాలని స్థలం చూపించారు. మంచినీరు, విద్యుత్తు సౌకర్యం లేదు. ఇక్కడికి వచ్చే రోడ్డును టింబర్‌ డిపో వాళ్లు మూసేశారు. విష సర్పాలు తిరుగుతున్నాయి. చీకటిలో చెట్ల పక్కన రావాలంటే భయమేస్తోంది. మరుగుదొడ్లు లేకపోవడంతో రాత్రి పూట ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారులకు ఇచ్చినట్లు మాకు కూడా ఇళ్లు కేటాయించి నేతలు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నాం. 
    – పి. పోసేశ్వరి, బాధితురాలు
     

Advertisement
Advertisement