కలహాల కాపురం.. | Sakshi
Sakshi News home page

కలహాల కాపురం..

Published Tue, Dec 6 2016 11:31 PM

కలహాల కాపురం..

కాపురానికి రానన్న భార్య
మనస్తాపంతో భర్త ఆత్మహత్య
రామరాజుపల్లిలో విషాదఛాయలు


పెళ్లంటే నూరేళ్ల పంట. సాఫీగా సాగిపోవాల్సిన కాపురంలో దంపతుల మధ్య కలహాలు వచ్చాయి. కలిసి ఉండే పరిస్థితి కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఉరిపోసుకుని ఊపిరి తీసుకున్నాడు.  

గుత్తి రూరల్‌ : భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దవడుగూరు మండలం చిట్టూరు రామరాజుపల్లిలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రామరాజుపల్లికి చెందిన కూలీ చిన్న తిరుపాలు (26)కు పామిడి మండలం సొరకాయలపేటకు చెందిన ఆశాతో ఎనిమిది నెలల క్రితం వివాహమైంది. కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి.

దీంతో ఆశా తరచూ పుట్టింటికి వెళ్లేది. అలా వెళ్లినపుడల్లా తిరిగి మెట్టినింటికి వచ్చేకి మొండికేసేది. ఈ క్రమంలో పెద్ద మనుషులు దాదాపు పదిసార్లుపం చాయితీలు కూడా చేశారు. ఇందులో భాగంగా సోమవారం కూడా భార్య ఊరిలోనే మరోసారి పంచాయితీ జరిగింది. భర్తతో కాపురానికి వచ్చేందుకు ససేమిరా అంది. మనస్తాపానికి గురైన తిరుపాలు స్వగ్రామం రామరాజుపల్లికి తిరిగి వచ్చి.. ఆ రాత్రంతా ఆలోచన చేస్తూ ఉండిపోయాడు. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి అనంతపురం తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రమణారెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement