పుట్టింటికి తీసుకెళ్తానని చెప్పి.. నరికేశాడు! | Sakshi
Sakshi News home page

పుట్టింటికి తీసుకెళ్తానని చెప్పి.. నరికేశాడు!

Published Fri, Oct 23 2015 7:51 PM

Husband kills wife

కణెకల్ (అనంతపురం) : పండగకు పుట్టింటికి తీసుకెళ్తానని భార్యను బైక్ మీద తీసుకెళ్లిన భర్త.. మధ్యలో బైక్ ఆపి ఆమెను వేట కొడవలితో నరికి చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనంతపురం జిల్లా కణెకల్ మండలం గెనిగెర గ్రామానికి చెందిన శోభ(19)కు బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి గ్రామానికి చెందిన వడ్డె అనిల్(24)తో ఏడాది కిందట వివాహమైంది. ఈ క్రమంలో దసరా పండగకు పుట్టింటికి వెళ్దామని భార్య చెప్పడంతో ఆమెను తీసుకొని బుధవారం మధ్యాహ్నం బైక్ పై బయలుదేరారు.

దగ్గర దారి అని చెప్పి బైక్‌ను కెనాల్ పక్కనుంచి తీసుకెళ్తూ మార్గమధ్యలో వాహనం ఆపి వెంట తెచ్చుకున్న వేట కొడవలితో ఆమెను నరికి చంపేశాడు. అనంతరం కాలువలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికి వెళ్లాడు. దీంతో పండగకు ఇంటికి వస్తానన్న కూతురు రాకపోవడంతో శోభ తండ్రి వెంకటేశ్వర్లు బ్రహ్మసముద్రం వెళ్లి ఆరా తీశాడు. అల్లుడు తనకు ఏమీ తెలియదు అనడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనిల్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో శుక్రవారం అసలు విషయం బయటపడింది.

Advertisement
Advertisement