Sakshi News home page

కట్టుకున్నొడే కడతేర్చాడు

Published Fri, Feb 24 2017 11:06 PM

కట్టుకున్నొడే కడతేర్చాడు - Sakshi

అనుమానంతో భార్యను చంపిన భర్త
 
కౌతాళం రూరల్‌: అనుమానమే పెనుభూతంగా మారి ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హల్వి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శాంసన్‌తో ఆదోనికి చెందిన సత్యమ్మ (30)కి దాదాపు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు సామెల్‌, కుమార్తె సుధ ఉన్నారు. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత శాంసన్‌ తన భార్యపై అనుమానం పెంచుకుని నిత్యం వేధించేవాడు. భర్త నరకయాతన భరించలేక సత్యమ్మ ఏడాది క్రితం పుట్టింటికి చేరింది. అయితే తాను మారానని పెద్దల పంచాయితీ చేసి ఆరు నెలల క్రితం భార్యను మళ్లీ కాపురానికి తెచ్చుకున్నాడు.
 
కొన్నాళ్లు బాగున్నా మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇద్దరు గొడవ పడ్డారు. శుక్రవారం తెల్లవారు జామున కుమార్తె సుధ లేచి చూసే సరికి తల్లి రక్తపు మడుగులో పడింది. భయాందోళనలతో స్థానికులకు తెలిపింది. భర్తనే హత్య చేసి పరారైనట్లు తెలుస్తోంది. కత్తితో కడుపు భాగంలో పొడవడంతో సత్యమ్మ మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆదోని తాలూకా సీఐ దైవ ప్రసాద్‌ గ్రామానికి చేరుకుని హత్యకు కారణాలు తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి నరసప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ఆసుపత్రికి తరలించారు.   
 

Advertisement
Advertisement