సత్వర న్యాయమే ధ్యేయం | Sakshi
Sakshi News home page

సత్వర న్యాయమే ధ్యేయం

Published Sat, Feb 11 2017 9:39 PM

సత్వర న్యాయమే ధ్యేయం

 జడ్జి వి.వి.శేషుబాబు 
 
కర్నూలు(లీగల్‌): కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్‌ అదాలత్‌ ధ్యేయమని జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి వి.వి.శేషుబాబు అన్నారు. శనివారం ఉదయం స్థానిక న్యాయ సేవాసదన్‌లో జాతీయ లోక్‌ అదాలత్‌ ప్రారంభ కార్యక్రమానికి ఏసీబీ కోర్టు జడ్జి కె.సుధాకర్‌తో పాటు హాజరయ్యారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.చాంద్‌బాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా చేపట్టిన జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి ఆధ్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 
ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కె.సుధాకర్‌ మాట్లాడుతూ.. ఇక్కడ పరిష్కారమైన కేసులకు అప్పీళ్లుండబోవన్నారు. లోక్‌ అదాలత్‌ జడ్జి ఎం.ఎ.సోమశేఖర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో లోక్‌ అదాలత్‌ ద్వారా సాధ్యమైనన్ని కేసులు పరిష్కారం చేసేందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.  ప్రిన్సిపల్‌ సబ్‌ జడ్జి శివకుమార్, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు పి.రాజు, ఎం.బాబు, కె.స్వప్నారాణి, గంగాభవాని, లోక్‌ అదాలత్‌ సభ్యులు, సీనియర్, జూనియర్‌ న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. 
 
జిల్లా వ్యాప్తంగా 2,549 కేసులు పరిష్కారం... 
జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 2,549 కేసులు పరిష్కారం అయినట్లు లోక్‌ అదాలత్‌ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్‌ తెలిపారు. కర్నూలులో 299 కేసులు, నంద్యాలలో 685, ఆదోనిలో 223, నందికొట్కూరులో 78, ఆత్మకూరులో 183, ఎమ్మిగనూరులో 231, ఆలూరులో 104, డోన్‌లో 130, ఆళ్లగడ్డలో 211, పత్తికొండలో 38, కోవెలకుంట్లలో 154, బనగానపల్లెలో 213 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. కర్నూలులో 72 రోడ్డు ప్రమాద నష్టపరిహార కేసులను న్యాయమూర్తి వి.వి.శేషుబాబు పరిష్కరించారన్నారు. ఇన్సురెన్స్‌ కంపెనీల నుంచి రెండున్నర కోట్ల రూపాయలు పైబడి బాధితులకు చెల్లించేందుకు కంపెనీలు అంగీకరించాయన్నారు. క్రిమినల్‌ కేసులను కె.స్వప్నరాణి, ఎం.బాబులు పరిష్కారం చేశారన్నారు. 
 

Advertisement
Advertisement