నెల్లూరు(బృందావనం):
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో శనివారం జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం గాంధీబొమ్మ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యపడుతుందని, ప్రత్యేక ప్రతిపత్తి ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాలో పలు ప్రాంతాల్లో పారిశ్రామీకరణ జరిగి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నెల్లూరు ప్రెస్క్లబ్ ఇన్చార్జి రాజన్, ఆలిండియా న్యూస్పేపర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్జిల్లా నాయకులు వెంకట్రావ్, ఓంకార్, షఫీ, ఎడిటర్స్, జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సర్వేపల్లి రామ్మూర్తి, కె.చంద్రబోస్, ఏపీయూడబ్ల్యూజే అనుబంధ సంఘం ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్స్ యూనియన్ నాయకులు వెంకటరమణ, వెంకట్రావ్, మాల్యాద్రి, ముజ్జు పాల్గొన్నారు.