కిర్లంపూడిపై నిఘానేత్రం | Sakshi
Sakshi News home page

కిర్లంపూడిపై నిఘానేత్రం

Published Tue, Nov 15 2016 11:46 PM

kiralampudi police force

  • ముద్రగడ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు  
  • కోనసీమంతటా 144 సెక్షన్‌
  • జగ్గంపేట/ కిర్లంపూడి :
    కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ యాత్రను పోలీసులు అడ్డగించి ఆయనను గృహ నిర్బంధంలో ఉంచడంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రావులపాలెం నుంచి జరపతలపెట్టిన పాదయాత్రకు అనుమతి లేదనే కారణంతో పోలీసులు ముద్రగడను కిర్లంపూడిలోనే అడ్డగించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు వ్యూహంతో జిల్లాలో భారీగా పోలీసు బలగాలను దింపారు. కోనసీమతోపాటు కిర్లంపూడిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కిర్లంపూడి గ్రామానికి వచ్చిపోయే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. అడుగడుగునా పోలీసులను బందోబస్తుకు నియమించడంతోపాటు కిర్లంపూడికి చేరుకునే ప్రధాన రహదారికి రాజుపాలెం, ప్రత్తిపాడు, రామవరం తదితరచోట్ల చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. సుమారు రెండు వేల మంది పోలీసులు కిర్లంపూడి, పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఓఎస్‌డీలు శివశంకరరెడ్డి, ఫకీరప్ప తదితరులు ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బంది బందోబస్తులో నిమగ్నమయ్యారు. యాత్రకు బయలుదేరిన ముద్రగడను మంగళవారం సాయంత్రం అడ్డగించిన పోలీసులు శాంతిభద్రతల సమస్యను ప్రస్తావించి 48 గంటలపాటు గృహ నిర్భంధం చేస్తామని తెలిపారు. దీంతో కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ ఉండిపోవాల్సి వచ్చింది. తాత్కాలికంగా పాదయాత్రను ముద్రగడ వాయిదా వేసినట్టు ప్రకటించారు. ముద్రగడ ఇంటిలో ఉండగా పోలీసులు మాత్రం ఆయన నివాసానికి వెలుపల భారీగా మోహరించి డేగ కన్ను వేశారు. రాత్రి గేటును మూసివేసి పోలీసులు రక్షణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముద్రగడ ఇంటి ఆవరణలో చోటుచేసుకునే పరిస్థితులు, వచ్చే అభిమానులు వివరాలను ఎప్పటికప్పుడు బెల్టుతో అమర్చుకున్న కెమెరాలతో చిత్రీకరిచండంతోపాటు దో¯ŒS సహాయంతో ముద్రగడ ఇంటి ఆవరణలో ఆకాశం నుంచి ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు తీసి వ్యూహాత్మకంగా పోలీసులు ముందుకు వెళుతున్నారు. ముద్రగడ ఇంటిలోనే ఉండిపోవడంతో ఒక విధంగా గ్రామంలో ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ గృహ నిర్బం ధాన్ని జేఏసీ నాయకుడు వాసురెడ్డి ఏసుదాసు తీవ్రంగా ఖండించారు. భారత రాజ్యాంగం, హక్కులను కాలరాసి ఎమర్జన్సీని టీడీపీ ప్రభుత్వం తలపిస్తుందని, వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం దారుణమన్నారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తుమ్మలపల్లి రమేష్, అద్దేపల్లి శ్రీథర్, జీవీ రమణ, సంగిశెట్టి అశోక్, గోపు చంటిబాబు, గణేషుల రాంబాబు, మలకల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.
     
     

Advertisement
Advertisement