నాకు ప్రాణహాని ఉంది.. | Sakshi
Sakshi News home page

నాకు ప్రాణహాని ఉంది..

Published Tue, Jun 14 2016 11:06 AM

నాకు ప్రాణహాని ఉంది.. - Sakshi

* వైఎస్సార్ సీపీ బీసీ విభాగం
* రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురవాచారి

పిడుగురాళ్ళ : తనకు ప్రాణ హాని ఉందని.. దానికి కారణం ఎమ్మెల్యే యరపతినేని అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి కుందుర్తి గురవాచారి తెలిపారు. పట్టణంలోని జానపాడు రోడ్డు నుంచి ఇంటికి వెళుతుంటే ఎవరో ఇద్దరు తనకు ద్విచక్రవాహనం అడ్డుపెట్టారని, వెంటనే అనుమానం వచ్చి పక్క నుంచి వెళ్లిపోతుంటే తనను వెంబడించి జానపాడు రోడ్డులోనే తీవ్రంగా కొట్టారని చెప్పారు.

తాను ఎమ్మెల్యే యరపతినేనిపై అక్రమ మైనింగ్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేశానని, అందుకే తనపై ఇటువంటి దాడులు జరుగుతున్నాయన్నారు. ఇటీవలే దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారని ఆయన తెలిపారు. తిరిగి మళ్లీ ఈరోజు తననే కొట్టి తనపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారని, పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి ఆయన తెలిపారు. ఈ విషయమై పట్టణ ఎస్‌ఐ జగదీష్‌ను ‘సాక్షి’ సోమవారం రాత్రి వివరణ కోరగా అనుపాలెం గ్రామానికి చెందిన దేవరశెట్టి బ్రహ్మం అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై జానపాడు రోడ్డుకు వెళుతుండగా నడుచుకుంటూ వెళుతున్న గురవాచారికి వాహనం తగిలింది.

దీంతో గురవాచారి బ్రహ్మాన్ని తీవ్రంగా కొట్టి గాయపరిచారని, అదే విధంగా దుర్భాషలాడి కులం పేరుతో దూషించాడని  పోలీస్‌స్టేషన్‌లో బ్రహ్మం ఫిర్యాదు చేయడంతో గురవాచారిని స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు ఎస్‌ఐ చెప్పారు.

Advertisement
Advertisement