మార్చి 30న లారీల బంద్‌ | Sakshi
Sakshi News home page

మార్చి 30న లారీల బంద్‌

Published Sun, Mar 26 2017 10:22 PM

మార్చి 30న  లారీల బంద్‌

 - పెంచిన ఆర్టీఏ చలానా ఫీజులకు నిరసనగా ఈ కార్యక్రమం
-   సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ 
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : పెంచిన ఆర్టీఏ చలానా ఫీజులకు నిరసనగా మార్చి 30వ తేదీన దక్షిణ భారతదేశ వ్యాప్తంగా నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ కార్మికులకు పిలుపునిచ్చారు.ఆదివారం కేకే భవన్‌లో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రైవేట్‌ ట్రాన్స్‌ఫోర్టు వర్కర్స్‌ యూనియన్‌ సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్‌ రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గఫూర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబర్‌ 29న ఇచ్చిన 894 ఉత్తర్వుల ద్వారా రవాణా రంగంలో ఫిట్‌నెస్, డ్రైవింగ్‌ లైసెన్స్, లేటు చలానా ఫీజులు రోజుకు రూ.50 చొప్పున 500 రెట్లకుపైగా పెంచిందన్నారు.
 
అంతటితో ఆగక 2017 మార్చి 3వ తేదీన మూడో పార్టీ ఇన్సూరెన్స్‌ను 50 శాతం పెంచుతూ ఐఆర్‌డీఏ ద్వారా ప్రతిపాదన పెట్టిందన్నారు. ఈ రెండు నిర్ణయాలు రవాణా రంగాన్ని కుదేలు చేసే అవకాశం ఉందన్నారు. వెంటనే   చలానా ఫీజులను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ముజఫర్, చిత్తూరు జిల్లా నాయకుడు గంగాధర్, నెల్లూరు జిల్లా నాయకుడు «శ్రీనివాసులు, కర్నూలు నాయకులు పుల్లారెడ్డి, సుబ్బారాయుడు, ఆటో యూనియన్‌ నాయకులు బి.రాధాకృష్ణా, ప్రభాకర్‌ పాల్గొన్నారు. 
26కేఎన్‌ఎల్‌39 : సమావేశంలో మాట్లాడుతున్న గఫూర్‌

Advertisement
Advertisement