ప్రేమజంట ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Published Tue, Aug 1 2017 10:40 PM

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

కళ్యాణదుర్గం: కులాంతర వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. మండల కేంద్రం బ్రహ్మసముద్రంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బ్రహ్మసముద్రం మండలం ఎస్‌.కోనాపురం గ్రామానికి చెందిన భీమరాజ్, మౌనిక ఏడాదిగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి కులాలు వేరుకావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. అబ్బాయి తండ్రి తిమ్మప్ప అమ్మాయి తల్లిదండ్రులు తిమ్మప్ప, పద్మావతిలను బ్రహ్మసముద్రం పోలీసుస్టేషన్‌కు పిలిపించారు.

అబ్బాయి, అమ్మాయి మేజర్లు అయినందున వారి ఇష్టప్రకారం పెళ్లి చేసుకోవచ్చని, ఎవ్వరూ వారిని బెదిరింపులకు గురి చేయరాదని పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులకూ చెప్పి పంపించారు. అనంతరం భీమరాజ్‌ బ్రహ్మసముద్రంలో ఉంటున్న తన పెదనాన్న వద్దకు అమ్మాయిని తీసుకుని వెళ్లాడు. పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుదామని పెదనాన్న, వారి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటికి వెళ్లారు. దీంతో పెళ్లికి ఆటంకాలు ఏర్పాడుతాయని భావించిన భీమరాజ్, మౌనికలు ఇంట్లోనే పెట్రోల్‌ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. కొద్దిసేపటి అనంతరం బాధితులను కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేసుకుని బ్రహ్మసముద్రం పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
Advertisement