తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారు చేయాలి | Sakshi
Sakshi News home page

తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారు చేయాలి

Published Thu, Jan 5 2017 12:47 AM

make voter list without errors

కర్నూలు(అగ్రికల్చర్‌): శాసనమండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల జాబితాతో పాటు సాధారణ ఓటర్ల జాబితాలను ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా తయారు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి ఓటర్ల జాబితా తయారీపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనమండలి ఓటర్ల జాబితాను ఈ నెల 12న, సాధారణ ఓటర్ల జాబితాను ఈ నెల 16న ప్రకటించాలన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల జాబితా తయారీలో ఎన్నికల కమీషన్‌ ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని వివరించారు. ఉపాధ్యాయ ఓటర్ల విషయంలో సంబంధిత అధికారి కౌంటర్‌ సంతకాన్ని విధిగా తీసుకోవాలన్నారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు.. ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు. ఈఆర్‌ఓలు, ఎన్నికల సెల్‌ సూపరింటెండెంట్‌ ఎలిజబెత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement