మంత్రి గంటాపై ఎమ్మెల్యేల తిరుగుబాటు | Sakshi
Sakshi News home page

మంత్రి గంటాపై ఎమ్మెల్యేల తిరుగుబాటు

Published Tue, Oct 18 2016 11:20 AM

మంత్రి గంటాపై ఎమ్మెల్యేల తిరుగుబాటు - Sakshi

విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మంగళవారం  సర్క్యూట్ హౌస్లో మంగళవారం ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఫిలింనగర్ సొసైటీకి భూకేటాయింపులపై ఎమ్మెల్యేలు గరం గరంగా ఉన్నారు. తొట్లకొండ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రానికి విఘాతం కలుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా  హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేంద్రంగా ఉన్న ఈ సొసైటీ కార్యకలాపాలను విశాఖలో విస్తరించేందుకు భూముల కేటాయింపు విషయమై తన బంధువైన ఓ సీనియర్ నిర్మాత ఒత్తిడితో మంత్రి గంటా శ్రీనివాసరావు తెర వెనుక మంత్రాంగం నడిపినట్లు సమాచారం. ఫిల్మ్ నగర్ సొసైటీకి భూముల కేటాయింపుపై అంతాతానై చక్రం తిప్పారు. వారంలోనే దస్త్రాలు సిద్ధమయ్యాయి.

దీంతో కాపులుప్పాడలో మంగమారిపేట పక్కనే తొట్లకొండను ఆనుకొని 395,413 సర్వే నెంబర్లలో ఉన్న 17 ఎకరాలను ఫిల్మ్ నగర్ సొసైటీ పేరిట ధారాదత్తం చేశారు. ఇక్కడ గజం రూ.10వేల నుంచి 15 వేలవరకు ఉంది. 17 ఎకరాల మార్కెట్ విలువ అక్షరాలరూ.100కోట్లకు పైమాటే. ఈ భూముల ప్రభుత్వ విలువే గజం రూ.4,638గా నిర్ణయించారు. అంటే ఇక్కడ ఎకరా 2కోట్ల 22లక్షల 64వేలుగా జిల్లా కలెక్టర్ యువరాజ్ నిర్ణయించారు. ఈ లెక్కన చూసుకున్నా 17 ఎకరాల విలువ రూ.37.85 కోట్లకు పైమాటే.

 ఇంత విలువైన భూమిని  ఎలాంటి సంప్రదింపులూ జరపకుండానే మంత్రి గంటా  ఒత్తిడితో జిల్లాయంత్రాంగం సొసైటీపరం చేసింది. ఎన్నేళ్లకు ఇస్తున్నాం..ఎకరా ధర ఎంతకు ఇస్తున్నాం? అనేది కూడా నిర్ణయించలేదు. పైసా కూడా లీజు మొత్తం చెల్లించలేదు. కనీసం భూములను అప్పగించే ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. అంతా గోప్యంగానే. కొద్ది క్రితం ఏర్పాటు మీడియా సమావేశంలో ఫిల్మ్‌నగర్ సొసైటీకి 17 ఎకరాల కేటాయింపు విషయమై ప్రతిపాదన అందిందని.. లీజు నిర్ణయించలేదని అధికారికంగానే ప్రకటించారు.

ఇంతలోనే భూమిని స్వాధీనం చేసుకుని ఫిల్మ్ నగర్ పెద్దలు భూమిపూజ కూడా చేసేశారు. గత సోమవారం సీఎం చంద్రబాబు ఎయిర్‌పోర్టులో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించేశారు. ఓ వైపు జిల్లా ఎమ్మెల్యేలు, మరోవైపు విశాఖ ఎంపీ హరిబాబు కూడా భూముల కేటాయింపుపై గుర్రుగా ఉన్నారు.  పరిశ్రమలకు, వాటర్ క్లబ్‌కు భూములివ్వమని కోరితే లేవని చెబుతున్న జిల్లామంత్రులు ఏవిధంగా 17 ఎకరాలు కేటాయించారంటూ హరిబాబు మండిపడినట్లు సమాచారం.

Advertisement
Advertisement