ఆశల దీపం ఆరిపోయింది | Sakshi
Sakshi News home page

ఆశల దీపం ఆరిపోయింది

Published Thu, Apr 13 2017 10:38 PM

ఆశల దీపం ఆరిపోయింది - Sakshi

- హైదరాబాద్‌లో యువ వైద్యురాలి బలవన్మరణం
- మృతురాలిది హౌసింగ్‌ బోర్డు కాలనీ
 
పెదగంట్యాడ(గాజువాక): ఏ కష్టం వచ్చిందేమో గానీ ఓ యువ వైద్యురాలు అర్ధంతరంగా తనువు చాలించింది. నాలుగు నెలల క్రితం ఎన్నో ఆశలతో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఆమె విగతజీవిగా ఇంటికి వచ్చే పరిస్థితి నెలకొంది. చిన్నప్పట్నుంచి చదువంటే ఆసక్తితో తన జీవితపు తొలి మెట్టుపై అడుగులు వేస్తున్న సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుని కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన ఎం.అనూష తల్లితో కలిసి నివాసం ఉంటోంది. తండ్రి మూగి ఎల్లాజీరావు స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగిగా పని చేసి ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు.

అప్పట్నుంచి తల్లి రాధావేణియే ఆమె ఆలనాపాలన చూసుకుంటుంది. అనూష విజయనగరంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. నాలుగు నెలల క్రితం ఉపాధిపై ఎన్నో ఆశలతో హైదరాబాద్‌కు వెళ్లింది. ఆమెకు ఎలాంటి కష్టం వచ్చిందో తెలియదు కానీ ఉరేసుకుని తనువు చాలించింది. రోజూ మాదిరిగా గురువారం కూడా అనూష ఫోన్‌ చేస్తుందని ఆమె తల్లి ఎదురు చూస్తుంది. అయితే ఎప్పటికీ ఫోన్‌ చేయకపోవడంతో రాధావేణి హాస్టల్‌కు ఫోన్‌ చేసి స్నేహితులను వాకబ్‌ చేయడంతో వారు విషయం చెప్పారు. అనూష ఉరేసుకుని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. మగ పిల్లలు లేకపోవడంతో అనూషనే మగ పిల్లాడిగా చూసుకుంటున్నామని రాధావేణి విలపిస్తుంది. విషయం తెలుసుకోవడానికి ఆమె బంధువులు హైదరాబాద్‌ బయలుదేరారు. అనూషకు శిరీష అనే సోదరి కూడా ఉంది. ఈమెకు వివాహమైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement